సీఎల్పీ విలీనం ఖాయం 

22 Apr, 2019 05:59 IST|Sakshi

ఎమ్మెల్యేలు రేగా, లింగయ్య, హరిప్రియ

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌లో కాంగ్రెస్‌ శాసనసభాపక్షం విలీనం ఖాయమని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య, హరిప్రియనాయక్‌ చెప్పారు. విలీన ప్రక్రియపై న్యాయనిపుణులతో చర్చిస్తున్నామన్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలు ఆదివారం అసెంబ్లీ ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం కేసీ ఆర్‌ రాష్ట్రంలో అమలు చేసే సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై తామంతా టీఆర్‌ఎస్‌లో చేరనున్న ట్లు చెప్పారు. తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసం, పెండింగ్‌ సమస్యల పరిష్కారం, ప్రాజెక్టుల పూర్తి కోసమే కేసీఆర్‌ నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

రాష్ట్రం లో కాంగ్రెస్‌కు పుట్టగతులుండవని, స్థానిక సం స్థల ఎన్నికల్లోనూ ప్రజలు టీఆర్‌ఎస్‌కు ఏకపక్షం గా తీర్పునిస్తారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల బీఫారాల పంపిణీని టీఆర్‌ఎస్‌ ప్రారంభించిన నేపథ్యంలోనే తాము కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ ముగ్గురికీ సంబంధించిన నియోజక వర్గాల్లోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల సంఖ్యకు అనుగుణంగా జాబితాను అందజేసి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డిని కలసి బీఫారాలను తీసుకెళ్లారు. మరోవైపు టీఆర్‌ఎస్‌లో సీఎల్పీని విలీనం చేసే ప్రక్రియ కోసమే ఈ ముగ్గురు అసెంబ్లీకి వచ్చినట్లు తెలిసింది. విలీన ప్రక్రియకు సంబంధించిన పత్రాలను సిద్ధం చేయడంలో భాగంగానే వీరిని టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఆహ్వానించినట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు