రాష్ట్రంలో మరో పాజిటివ్‌...

15 Mar, 2020 05:31 IST|Sakshi

ఇటలీ నుంచి వచ్చిన కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట యువతి

పుణే ల్యాబ్‌కు మరో ముగ్గురు అనుమానితుల నమూనాలు

ఐసోలేషన్‌ కోసం గచ్చిబౌలి స్టేడియంలోని 400 గదులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మరో కోవిడ్‌ పాజిటివ్‌ కేసు నమోదైంది. కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన ఓ యువతికి పాజిటివ్‌ వచ్చినట్లుగా నిర్ధారించారు. ఆమె ఇటీవలే ఇటలీ నుంచి వచ్చింది. జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడున్న ఆమె కొత్తగూడెంలోని ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా.. కోవిడ్‌ వైరస్‌ లక్షణాలు కన్పించడంతో అక్కడి వైద్యుల సూచన మేరకు ఈ నెల 11న గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె నమూనాలు గాంధీలోనే పరీక్షించగా కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. మరోసారి నమూనాలను పుణే ల్యాబ్‌కు పంపగా, శుక్రవారం అందిన నివేదికలో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కాగా, మంచిర్యాలకు చెందిన ఒక వ్యక్తి, అతడి స్నేహితుడు ఇద్దరికీ కోవిడ్‌ లక్షణాలు ఉండటంతో గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. అలాగే సౌదీ నుంచి వచ్చిన మరో కోవిడ్‌ అనుమానితుడికి కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీరి నమూనాలను పుణేలోని ల్యాబ్‌కు పంపారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లికి చెందిన మరో కోవిడ్‌ అనుమానితుడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

అతడు లండన్‌లో చదువుకుంటూ ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. ఖమ్మంలోని శ్రీరామ్‌హిల్స్‌కు చెందిన మరో వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో ప్రభుత్వ ఆస్పత్రిలో చేరగా.. వెంటనే హైదరాబాద్‌ తరలించారు. వీరిద్దరికీ వైరస్‌ లేనట్లు గాంధీ ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గోపులాపూర్‌కు చెందిన ఓ వ్యక్తి (47) ఐదు రోజుల క్రితం సౌదీ అరేబియా నుంచి వచ్చాడు. దగ్గు, జ్వరం బాధ పడుతుండటంతో పరీక్షించిన వైద్యులు.. కరోనా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే.. ఇతనికి కరోనా వైరస్‌ లేనట్లు నిర్ధారణ అయింది. సారంగాపూర్‌ మండలం కోనాపూర్‌కు చెందిన ఓ వ్యక్తి 20 రోజుల కింద బహ్రెయిన్‌ నుంచి వచ్చాడు. దగ్గు తీవ్రంగా ఉండటంతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలోని ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. 24 గంటల పాటు వైద్యసేవలు అందించిన తర్వాత తగ్గుముఖం పట్టకపోతే హైదరాబాద్‌కు తరలించనున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. బెంగళూరు నుంచి వచ్చిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ 88 మందితో కాంటాక్ట్‌ కాగా, వారందరికీ కోవిడ్‌ పరీక్ష నిర్వహించగా నెగెటివ్‌ వచ్చింది. నయమైన వ్యక్తి మినహా మిగిలిన పాజిటివ్‌ వచ్చి న నలుగురు హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. వారితో కాంటాక్ట్‌ అయిన వారిని గుర్తించే పనిలో వైద్య ఆరోగ్య శాఖ నిమగ్నమైంది.

ఫీవర్‌కు మరో అనుమానిత కేసు 
నల్లకుంట ఫీవర్‌ ఆసుపత్రిలో శనివారం మరో అనుమానిత కోవిడ్‌ కేసు నమోదైంది. నల్లగొండ జిల్లా విమలపల్లి మండలం, శెట్టపాలెం గ్రామా నికి చెందిన ఓ వ్యక్తి (32) ఇటీవల చైనా నుంచి మలేషియాకు.. అక్కడి నుంచి భారత్‌ వచ్చాడు. అతడు కొద్ది రోజులుగా దగ్గు, జలుబుతో బాధపడుతున్నారు. శనివారం అతడిని కుటుంబ సభ్యు లు కోవిడ్‌ నిర్ధారణ పరీక్షల కోసం నల్లకుంట ఫీవర్‌ ఆసుపత్రికి తీసుకొచ్చారు.  అతడి నమూనాలను గాంధీ ల్యాబ్‌కు పంపనున్నారు. ప్రస్తుతం వికారాబాద్‌లో హరిత హోటల్, ఫారెస్ట్‌ అకాడమీ వంటి సంస్థల్లో ఐసోలేషన్‌ వార్డులు ఉంచుతారు. కోవిడ్‌ బాధితుల సంఖ్య మరీ పెరిగితే గచ్చిబౌలి స్టేడియానికి అనుబంధంగా ఉండే 400 గదులను కూడా వాడుకోవాలని నిర్ణయించారు.

కలెక్టర్లకు విస్తృత అధికారాలు.. 
కోవిడ్‌ వైరస్‌ నేపథ్యంలో జిల్లాలకు వచ్చే విదేశీ ప్రయాణికుల వివరాలు, వారి ద్వారా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కలెక్టర్లకు విస్తృత అధికారాలు ఇవ్వా లని నిర్ణయిం చారు. ప్రకృతి వైప రీత్యాలు జరిగినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారో, ఇప్పుడు కూడా కలెక్టర్లు అలాంటి చర్యలే తీసుకోవాలని నిర్ణయించారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయొద్దని చెబుతున్నారు.

మరిన్ని వార్తలు