వెబ్‌సైట్‌లో జవాబు పత్రాలు

11 Mar, 2014 03:14 IST|Sakshi
వెబ్‌సైట్‌లో జవాబు పత్రాలు

బీటెక్, ఎంటెక్ మూల్యాంకనంలో సంస్కరణలు
ఉన్నత విద్యా మండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి
హెల్ప్‌లైన్ కేంద్రాల్లోనే ఆప్షన్ల నమోదుపై పునరాలోచన
ఇంటర్ మార్కులతో మేనేజ్‌మెంట్ కోటా భర్తీపై తీసుకోని నిర్ణయం
వెబ్‌సైట్‌లో ఎంసెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షల ఓఎంఆర్ జవాబు పత్రాలు

 
సాక్షి, హైదరాబాద్: బీటెక్, ఎంటెక్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో సంస్కరణలు తీసుకువస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా బీటెక్, ఎంటెక్‌లలో ఆన్‌లైన్‌లో మూల్యాంకన విధానాన్ని పూర్తిస్థాయిలో అమల్లోకి తేనున్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు ఫలితాల అనంతరం విద్యార్థుల జవాబు పత్రాలను కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచేలా చర్యలు చేపడుతున్నామని, తద్వారా పరీక్షలు, మూల్యాంకనంలో పారదర్శకత కు పెద్దపీట వేయనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు తాము రాసిన జవాబు పత్రాలు, తమకు వచ్చిన మార్కులను చూసుకునే సదుపాయం కల్పించనున్నట్లు చెప్పారు. ఈసారి ఎంసెట్ సహా ఐసెట్, ఈసెట్, పీజీఈసెట్, పీఈసెట్, లాసెట్ తదితర అన్ని రకాల ప్రవేశ పరీక్షల్లో విద్యార్థులు ఓఎంఆర్ జవాబు పత్రాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఉన్నత విద్య, పరీక్షల నిర్వహణలో తీసుకురానున్న మార్పులను సోమవారం ఆయన వెల్లడించారు.
 
  హైదరాబాద్ జేఎన్‌టీయూ సహా అన్ని కాలేజీల్లో నిర్వహిస్తున్న బీటెక్, ఎంటెక్ కోర్సుల పరీక్షల్లో ఆన్‌లైన్ మాల్యాంకనం అమలు చేస్తామని, దీనిపై ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు. ఇంటర్ మార్కులతోనే ఇంజనీరింగ్ మేనేజ్‌మెంట్ కోటా సీట్లను భర్తీ చేయాలన్న అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ప్రభుత్వానికి సిఫారసు చేయలేదని మండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. దీనిపై చర్చ జరిగిందని, అదీ 5 శాతం సీట్ల భర్తీ ఎలాగన్న అంశంపైనే చర్చించినట్లు తెలిపారు.
 
 ఇదీ ఆన్‌లైన్ విధానం:
పరీక్షలకు హాజరైన విద్యార్థుల జవాబు పత్రాలు అన్నింటినీ మొదట స్కాన్ చేస్తారు. వాటిని మూల్యాంకన కేంద్రాలకు ఆన్‌లైన్‌లోనే పంపుతారు. మూల్యాంకనం చేసే ఫ్యాకల్టీ విద్యార్థి రాసిన జవాబులను ఆన్‌లైన్లోనే చదివి మార్కులను ఆన్‌లైన్‌లోనే అప్‌లోడ్ చేస్తారు. అలాగే ఒక్కో సబ్జెక్టుకు సంబంధించి విద్యార్థి రాసిన జవాబులను ఆన్‌లైన్‌లోనే వేరు చేస్తారు. అలా వేరు చేసిన జవాబుల్లో ఒకే నంబర్ గల జవాబులను మూల్యాకనం కోసం ఆన్‌లైన్‌లోనే ఒక ఫ్యాకల్టీకి కేటాయిస్తారు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్ సహాయంతో జవాబులను వేరు చేయడం, మూల్యాంకనం తరువాత సదరు విద్యార్థికి సంబంధించిన అన్ని ప్రశ్నల జవాబులను మళ్లీ క్రోడీకరించడం, వాటికి కేటాయించిన మొత్తం మార్కులను కలపడం జరుగుతుంది. ఇక ఫలితాల వెల్లడి తర్వాత ఆ జవాబు పత్రాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు. తద్వారా విద్యార్థి తన జవాబుపత్రం, తనకు వచ్చిన మార్కులను ఆన్‌లైన్‌లో చూసుకునే వెసులుబాటు కల్పిస్తారు.
 
 ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లపై పునరాలోచన
 ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం విద్యార్థులు హెల్ప్‌లైన్ కేంద్రాల్లోనే (హెచ్‌ఎల్‌సీ) వెబ్ ఆప్షన్లు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని తీసుకున్న నిర్ణయంపై అధికారులు పునరాలోచన చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న హెల్ప్‌లైన్ కేంద్రాల సంఖ్య పెంచడం, వాటిల్లో పనిచేసేందుకు 2,500 మందికి పైగా ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని నియమించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఔట్ సోర్సింగ్ సిబ్బందితో దళారులు కుమ్మైక్కై విద్యార్థుల పాస్‌వర్డ్ తీసుకుంటే ఎలాగన్న కోణంలో ఆలోచిస్తున్నారు. త్వరలో దీనిపై మరోసారి చర్చించి తుది నిర్ణయం ప్రకటించనున్నారు.

మరిన్ని వార్తలు