సాక్షి, హైదరాబాద్: స్పై కెమెరాల నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని సినీనటి సనా అన్నారు. మహిళల జీవితాలతో చెలగాటమాడుతున్న రహస్య కెమెరాలు విచ్చలవిడిగా అమ్మకుండా చూడాలని కోరారు. ఆన్లైన్లో స్పై కెమెరాలు కేవలం రూ.250కే దొరకటం విచారకరమన్నారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో స్వచ్ఛంద సంస్థ హెవెన్ హోమ్స్ సొసైటీ ఆధ్వర్యంలో ‘యాంటి రెడ్ ఐ’ పేరుతో చేపడుతున్న మిస్డ్కాల్ (8099259925) క్యాపెయినింగ్ బ్రోచర్ను సనా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సనా మాట్లాడుతూ.. స్పై కెమెరాల వల్ల కలిగే అనర్థాలపై నటీమణులు సమంత, మెహ్రీన్లు ఎంతో ఆవేదన వ్యక్తం చేసి తమతో కలిసి ఈ మిస్డ్కాల్ క్యాపెయినింగ్లో భాగస్వాములయ్యారని తెలిపారు. రహస్య కెమెరాలను దుర్వినియోగం చేస్తూ మహిళలను సమిధలుగా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. షాంపు బాటిల్స్, టూత్బ్రష్ తదితర వస్తువుల్లో సులువుగా స్పై కెమెరాలు పెట్టేస్తున్నారని తెలిపారు. తుపాకులకు లైసెన్సులు పెట్టినట్టుగానే రహస్య కెమెరాల విక్రయాలకూ లైసెన్స్లు తప్పనిసరి చేయాలన్నారు. కార్యక్రమంలో హెవెన్ హోమ్స్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షురాలు జి. వరలక్ష్మీ, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్పర్సన్ భువనేశ్వరి, సీనియర్ లాయర్ రాధా రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.