ఆకలితో ఉంటే ఈ నెంబర్‌కి కాల్‌ చేయండి

25 Apr, 2020 11:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఎవరికైనా భోజనం కావాలనుకొంటే జీహెచ్‌ఎంసీ కాల్‌ సెంటర్‌ నంబర్‌ 040- 21111111కి ఫోన్‌ చేయాలని మాజీ ఎంపీ కవిత పేర్కొన్నారు. ఈ నెంబర్‌ అందరికీ తెలిసేలా చేయాలని హ్యాష్‌ ట్యాగ్‌తో(#040-21111111) ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఒక్కరు కూడా ఆకలితో ఉండకూడదనే దృఢసంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. కవిత పోస్ట్‌కు మంచి కార్యక్రమం అంటూ నటి మంచు లక్ష్మితో పాటూ పలువురు రాజకీయ నాయకులు రీట్వీట్‌ చేస్తున్నారు. 
 

మరోవైపు, జీహెచ్‌ఎంసీతోపాటు తొమ్మిది కార్పొరేషన్లలో 300 అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా ప్రతిరోజు 2 లక్షల మందికి రెండు పూటలా భోజనం అందిస్తున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ చెప్పారు. రాష్ట్రంలో మరో 50 అన్నపూర్ణ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కేంద్రాల్లో ఉదయం 10.30 గంటలకు, సాయంత్రం 5 గంటలకు భోజనం అందించేలా వేళలు కూడా మార్చామన్నారు. ఎక్కడైనా భోజనం అవసరం ఉంటే జీహెచ్‌ఎంసీ కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేయాలని, జీహెచ్‌ఎంసీ యాప్‌ ద్వారా అహారాన్ని కోరవచ్చని చెప్పారు.

మరిన్ని వార్తలు