చంద్రబాబు రాక

12 Feb, 2015 02:02 IST|Sakshi
చంద్రబాబు రాక

నేడు జిల్లాలో ఏపీ సీఎం పర్యటన
తెలంగాణలో మొదటి టూర్
కార్యకర్తలతో సుదీర్ఘ చర్చలు
విజయవంతానికి నేతల ప్రయత్నం

 
వరంగల్ రూరల్ : సమైక్య ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ   రాష్ట్రం ఏర్పడ్డాక చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి హోదాలో మొదటి సారిగా జిల్లా పర్యటనకు వస్తున్నారు.       గురువారం ఆయన రోడ్డు మార్గం  ద్వారా హైదరాబాద్ నుంచి జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఆయనకు స్వాగతం పలికేందుకు నేతలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 200 మందితో మోటార్ సైకిళ్ల ర్యాలీ నిర్వహించనున్నారు. హన్మకొండలోని హయగ్రీవాచారి మైదానంలో జరిగే సభాస్థలికి మాజీ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాంగణంగా నామకరణం చేయనున్నారు. కాగా, టీడీపీ ప్రతినిధులతో జరిగే సభాస్థలిలో భారీగా ఏర్పాట్లు చేశారు. ప్రతి నియోజకవర్గం నుంచి వచ్చే కార్యకర్తలు ప్రాంగణం ఆవరణలో ఏర్పాటు చేసే కౌంటర్లలో పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. నమోదు చేసుకొన్న వారినే లోనికి అనుమతిస్తారు. ఉదయం 11.30 గంటలకు ప్రతినిధుల సభ ప్రారంభం అవుతుంది.
 
నియోజకవర్గాలవారీగా సమీక్ష

జిల్లా వ్యాప్తంగా వచ్చిన ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం ఒక గంట పాటు చంద్రబాబు విరామం తీసుకుంటారు. అనంతరం ఆక్కడే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షామియానాలో నియోజకవర్గాలవారీగా కార్యకర్తలతో పార్టీ భవిష్యత్ కార్యక్రమాలపై చర్చించి దశ, దిశలను నిర్ధేశిస్తారు. అన్ని నియోజకవర్గాలతో సమీక్ష అనంత రం బాబు ఇక్కడే బస చేస్తారు. శుక్రవారం ఉదయం హెలీక్యాప్టర్‌లో హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా ఏర్పాట్లను ఆ పార్టీ జిల్లా ఇన్‌చార్జి ఇ నుగాల పెద్దిరెడ్డి, టీడీఎల్పీ పక్ష నేత దయాకర్‌రావు, ఎంపీలు గరికపాటి మోహన్‌రావు, సుధారాణి, మాజీ ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, సీతక్క, వేం నరేందర్‌రెడ్డి, పార్టీ అర్బన్ అధ్యక్షుడు అనిశెట్టి మురళీమనోహర్  పర్యవేక్షించారు. కాగా, చంద్రబాబు పర్యట నను వీవీఐపీగా పరిగణించి జిల్లాలోని వివిధ ప్రధాన శాఖలకు చెందిన 14 మంది అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ వాకాటి కరుణ బుధవారం ఉత్తర్వులు జారీ చేశరు. జిల్లా ఎస్పీతోపాటు డీఆర్వో, ఆర్డీవోలు, డీఅండ్‌హెచ్‌వో ఇతర అధికారులను వారివారి శాఖల పరంగా చేపట్టాల్సి చర్యలు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

వాహనాలకు పార్కింగ్..

వరంగల్ క్రైం : చంద్రబాబు పర్యటనకు జిల్లా నలుమూలల నుంచి వచ్చే వాహనాలకు పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేసినట్టు ట్రాఫిక్ డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. మహబూబాబాద్, వర్ధన్నపేట నుంచి వచ్చే వాహనాలకు హంటర్‌రోడ్డులోని విష్ణుప్రియ గార్డెన్స్‌లో, జనగామ ప్రాంతం నుంచి వచ్చే వాహనాలకు ఏకశిల పార్కును, ములుగు, నర్సంపేట ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు పద్మాక్షమ్మ గుట్టవద్ద పార్కింగ్ ఏర్పాటు చేశారు.
 

మరిన్ని వార్తలు