ఇంజనీరింగ్ ప్రవేశాలకు నోటిఫికేషన్

13 Jun, 2015 01:56 IST|Sakshi

ఈనెల 18 నుంచి 23 వరకు సర్టిఫికెట్ల పరిశీలన
* కాలేజీలు, సీట్ల వివరాలు తేలాకే వెబ్ ఆప్షన్ల ప్రక్రియ

సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం ఎంసెట్ (ఎంపీసీ స్ట్రీమ్) ప్రవేశాల కమిటీ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వులకు లోబడి ఈ నోటిఫికేషన్‌ను ప్రకటించింది. ఈనెల 18 నుంచి 23వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను నిర్వహించనున్నట్లు కమిటీ పేర్కొంది. ప్రతి రోజు రెండు దశలుగా వెరిఫికేషన్‌ను చేపట్టనుంది.

ఉదయం 9కి మొదటి పరిశీలన ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం 12:30కి రెండో దశ పరిశీలన చేపడతారు. ఎంసెట్‌లో విద్యార్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టే హెల్ప్‌లైన్ కేంద్రాలు, ఇతర వివరాలను వెబ్‌సైట్‌లో (జ్ట్టిఞట://్టట్ఛ్చఝఛ్ఛ్టి.జీఛి.జీ) పొందవచ్చని పేర్కొంది. కాలేజీలకు గుర్తింపు ప్రక్రియపై శుక్రవారం హైకోర్టు జారీచేసిన ఉత్తర్వుల అనంతరం రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, ఎంసెట్ ప్రవేశాల కమిటీ అధికారులు సమావేశమై చర్చించారు. తర్వాత నోటిఫికేషన్‌ను జారీ చేశారు. కాలేజీల యాజమాన్యాలకు ఈనెల 27 వరకు గడువు ఇచ్చినందున, కాలేజీలు, సీట్ల వివరాలు ఆ తరువాతే తేలనున్నాయి. అవి వచ్చాకే వెబ్ ఆప్షన్ల ప్రక్రియను చేపట్టనున్నారు.
 
విద్యార్థులకు సూచనలు..
వెరిఫికేషన్‌కు హాజరయ్యే విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు రెండు సెట్ల సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు వెంట తెచ్చుకోవాలి. అలాగే ఎంసెట్ ర్యాంకు కార్డు, హాల్‌టికెట్, ఇంటర్మీడియెట్ మార్కుల మెమో, పాస్ సర్టిఫికెట్, పదో తరగతి మార్కుల మెమో, ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, జనవరి 1వ తేదీ తరువాత జారీచేసిన ఆదాయం ధ్రువీకరణ పత్రం తదితర సర్టిఫికెట్లను వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది.

ప్రాసెసింగ్ ఫీజు కింద ఓసీ, బీసీ విద్యార్థులు రూ. 800, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.400 చెల్లించాల్సి ఉంటుంది. కాలేజీలు, సీట్లు, కాలేజీ వారీగా ఫీజుల వివరాలను వెబ్ ఆప్షన్ల ప్రారంభానికి ముందు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. వికలాంగులు, ఎన్‌సీసీ కోటా, ఆంగ్లోఇండియన్, స్పోర్ట్ కోటా విద్యార్థులకు ఈనెల 18 నుంచి 21వ తేదీ వరకు హైదరాబాద్ మాసాబ్‌ట్యాంకులోని సాంకేతిక విద్యా భవన్‌లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపడతారు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనారిటీ విద్యార్థులకు 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ర్యాంకుల వారీగా నిర్ణీత హెల్ప్‌లైన్ కేంద్రంలో వెరిఫికేషన్ ఉంటుంది.

మరిన్ని వార్తలు