కాళేశ్వరంపై ఏపీ ఫిర్యాదు

21 Jun, 2018 03:02 IST|Sakshi

ప్రాజెక్టు పనులు ఆపించాలంటూ కేంద్రానికి లేఖ

అపెక్స్‌ కౌన్సిల్‌ ఆమోదం లేనిదే ఎలా చేపడతారు?

సాంకేతిక అనుమతుల జారీపై అభ్యంతరం

దిగువనున్న తమకు తీవ్ర నష్టం జరుగుతుందని వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్‌ మళ్లీ ఫిర్యాదు చేసింది. ఈ ప్రాజెక్టును అపెక్స్‌ కౌన్సిల్‌కు లాగే ప్రయత్నం చేస్తోంది. అంతేగాకుండా కేంద్ర జల సంఘంజారీ చేసిన సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) అనుమతులపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధంగా కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారని, దీనిపై అపెక్స్‌ కమిటీలో తేలే వరకు పనులను నిలిపి వేయించాలని, టీఏసీ అనుమతులను పునఃసమీక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తోంది. ఈ మేరకు ఏపీ జల వనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ రెండ్రోజుల కింద కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి ఉపేంద్ర ప్రసాద్‌ సింగ్‌కు లేఖ రాశారు.

తొలి నుంచి.. ఆంధ్రప్రదేశ్‌ తొలి నుంచీ కాళేశ్వరం ప్రాజెక్టుపై అభ్యంతరం చెబుతూ వస్తోంది. ఇది పూర్తిగా కొత్త ప్రాజెక్టేనని వాదిస్తోంది. పునర్విభజన చట్టం ప్రకారం.. గోదావరి బేసిన్‌లో ఎలాంటి కొత్త ప్రాజెక్టులు చేపట్టినా అపెక్స్‌ కౌన్సిల్, గోదావరి బోర్డుల అనుమతి తీసుకోవాల్సి ఉందని పేర్కొంటోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈ అనుమతులు లేనందున దాన్ని అక్రమ ప్రాజెక్టుగానే చూడాలని వాదిస్తోంది. అంతేకాదు కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణం, నీటి వినియోగానికి సంబంధించి తెలంగాణ, మహారాష్ట్రల మధ్య కుదిరిన అంతరాష్ట్ర ఒప్పందాన్ని కూడా ఏపీ వ్యతిరేకించింది. బేసిన్‌ పరిధిలో ఉన్న తమను సంప్రదించకుండా ఒప్పందాలు ఎలా చేసుకుంటారని, అది తమ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని పేర్కొంటూ కేంద్ర జల వనరుల శాఖకు ఫిర్యాదులు కూడా చేసింది. గోదావరిలో ఎలాంటి నీటి వినియోగం చేసినా కేంద్రం, బోర్డుతో పాటు తమ ఆమోదం తప్పనిసరైనా.. అలాంటిదేమీ జరగలేదని వివరించింది. దిగువ రాష్ట్రాల ప్రయోజనాలు, హక్కులను పట్టించుకోకుండా వ్యవహరించడం ఏమిటని.. దీనిపై తక్షణమే జోక్యం చేసుకోవాలని కేంద్రాన్ని కోరింది. దాంతో కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై గోదావరి బోర్డును అభిప్రాయం చెప్పాల్సిందిగా కోరింది.

కీలక అనుమతులన్నీ రావడంతో..
ఏపీ లేవనెత్తిన వివాదాలు కొనసాగుతున్న సమయంలోనే.. కాళేశ్వరం ప్రాజెక్టుకు హైడ్రాలజీ, అటవీ, పర్యావరణ అనుమతులతోపాటు కీలకమైన టీఏసీ అనుమతి కూడా ఇటీవలే లభించింది. దీనిపై మండిపడిన ఏపీ తాజాగా మరోసారి కేంద్రానికి ఫిర్యాదు చేసింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 85(సి), 85(డి) నిబంధన కింద ఏదైనా కొత్త ప్రాజెక్టు చేపడితే.. దానికి బోర్డు నుంచి కచ్చితంగా అనుమతులు తీసుకోవాల్సి ఉందని.. కానీ ఈ ప్రాజెక్టు విషయంలో అలా జరగలేదని ఫిర్యాదులో పేర్కొంది. గోదావరిలో ఉమ్మడి వాటాగా ఉన్న 1,494 టీఎంసీల నీటిని ఇరు రాష్ట్రాలు ఎలా వాడుకోవాలో ఇప్పటివరకు ఎలాంటి ఒప్పందాలు లేవని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని పట్టించుకోకుండా కేంద్ర జల సంఘం అనుమతులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది. ప్రాజెక్టు ద్వారా తెలంగాణ 225 టీఎంసీల మేర నీటిని వినియోగించుకుంటే.. దిగువ రాష్ట్రమైన తమ ప్రయోజనాలు దెబ్బతింటాయని పేర్కొంది. అందువల్ల అపెక్స్‌ కౌన్సిల్‌లో ఈ ప్రాజెక్టుపై పూర్తిస్థాయి చర్చ జరిగి.. ఆమోదం దక్కే వరకు పనులను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరింది. 

మరిన్ని వార్తలు