కేసీఆర్‌ పథకాలు భేష్‌ 

6 Nov, 2017 02:24 IST|Sakshi

ఏపీ ఆర్థిక మంత్రి యనమల కితాబు  

ప్రజల నుంచీ సానుకూల స్పందన 

మరో తిరుపతిగా యాదాద్రి 

సాక్షి, యాదాద్రి: తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బాగున్నాయని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కితాబిచ్చారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి, అమ్మవారిని ఆదివారం ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు. కేసీఆర్‌ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, ఈ విషయమై ప్రజల నుంచి కూడా సానుకూల స్పందన వస్తున్నట్లు తనకు తెలిసిందని చెప్పారు.

యాదాద్రిని ప్రభుత్వం మరో తిరుమల తిరుపతిగా తీర్చిదిద్దడం అభినందనీయమని చెప్పారు. ఈ పుణ్యక్షేత్రం రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని స్వామి వారిని వేడుకున్నట్లు యనమల పేర్కొన్నారు. అనంతరం ప్రధానాలయ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈఓ గీతారెడ్డి పనుల గురించి మంత్రికి వివరించారు.

మరిన్ని వార్తలు