ఆ హక్కు బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌కు లేదు

14 Apr, 2017 03:10 IST|Sakshi
ఆ హక్కు బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌కు లేదు

పట్టిసీమ, పోలవరం వాటాల పంపిణీపై ఏపీ కొత్త వాదన
వాటాలు రావాల్సిందేనంటున్న తెలంగాణ ప్రభుత్వం


సాక్షి, హైదరాబాద్‌: గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలిస్తూ చేపట్టిన పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల నుంచి ఎగువ రాష్ట్రాలకు దక్కే నీటి వాటాలపై ఏపీ మరో కొర్రీ పెట్టింది. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులతో ఎగువ రాష్ట్రాలకు దక్కే నీటి వాటాలను తేల్చే అధికారం బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌కు లేదని.. ఆ అధికారం గోదావరి ట్రిబ్యునల్‌కే ఉందని కొత్త వాదన మొదలుపెట్టింది. ఇన్నాళ్లూ పట్టిసీమ, పోలవరం వాటాల్ని బ్రిజేశ్‌ ట్రిబ్యు నలే తేల్చుతుందంటూ కేంద్ర కమిటీలు, బోర్డుల ముందు చెప్పిన ఏపీ.. ఇప్పుడు పూర్తి విరుద్ధమైన వాదన చేస్తుండడం గమనార్హం.

అఫిడవిట్‌ దాఖలు
కృష్ణా జలాల విషయంగా తామిచ్చిన తీర్పు పై అఫిడవిట్‌ దాఖలు చేయాలని బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌ గత నెలలోనే తెలంగాణ, ఏపీ లను ఆదేశించింది. ఈ మేరకు ఏపీ గురు వారం అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఇందులో  ఎస్సారెస్పీ, వరద కాల్వ, దేవాదుల, సింగూరు నుంచి హైదరాబాద్‌కు నీటి సరఫరా పేరుతో తెలంగాణ గోదావరి జలాలను కృష్ణాబేసిన్‌కు తరలిస్తోందని.. కర్ణాటక, మహారాష్ట్రలు సైతం అదే తరహాలో కృష్ణా నీటిని ఇతర బేసిన్లకు తరలిస్తున్నా యని అందులో వివరించింది.

 మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆ జలాలపై గోదావరి ట్రిబ్యునల్‌ మాత్రమే పునః సమీక్ష చేయ గలదని.. బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌కు ఆ అధికారం లేదని పేర్కొంది. ఇక తెలంగాణ మైనర్‌ ఇరిగేషన్‌ కింద ఎక్కువ నీటిని వినియోగిం చుకుంటూ లెక్కల్లో తక్కువగా చూపుతోం దని ఆరోపించింది. ఆ లెక్కలను తేల్చి ఏపీకి కృష్ణా జలాల్లో వాటా పెంచాలని కోరింది.  

తెలంగాణకు వాటా పెరగాల్సిందే..
పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల ద్వారా ఏపీ 160 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణా బేసిన్‌ కు తరలిస్తున్నందున.. అందులో తెలం గాణకు 73 టీఎంసీలు దక్కాలని తెలంగాణ మరోసారి స్పష్టం చేయనుంది. దీనిపై త్వరలో అఫిడవిట్‌ సమర్పించనుంది.

>
మరిన్ని వార్తలు