ఓటు గల్లంతుపై శోభనా కామినేని ఫైర్‌

11 Apr, 2019 12:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : లోక్‌సభ ఎన్నికల తొలివిడత పోలింగ్‌లో ఓట్ల గల్లంతు వ్యవహారం విమర్శలకు తావిస్తోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు విదేశాల నుంచి తిరిగివచ్చిన అపోలో హాస్పిటల్స్‌ చీఫ్‌ ప్రతాప్‌పెడ్డి కుమార్తె శోభనా కామినేని తన ఓటు గల్లంతైన విషయం తెలుసుకుని అధికారులపై మండిపడ్డారు. ఓటు వేసేందుకు నగరంలోని సంబంధిత పోలింగ్‌ కేంద్రానికి వెళ్లగా ఆమె ఓటును తొలగించారని అక్కడున్న సిబ్బంది తెలపడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన పోలింగ్‌ కేంద్రానికే తాను వెళ్లగా ఓటును తొలగించారని తెలిసిందని ఆవేదన వ్యక్తం చేశారు. భారత పౌరురాలిగా తనకిది విచారకరమైన రోజని, తాను భారత పౌరురాలిని కాదా, ఈ దేశంలో తన ఓటు ముఖ్యం కాదా అంటూ ప్రశ్నించారు. పౌరురాలిగా తనకు జరిగిన అన్యాయాన్ని సహించనని స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల తొలివిడత పోలింగ్‌లో భాగంగా గురువారం తెలంగాణలోని మొత్తం 17 లోక్‌సభ స్ధానాలకు పోలింగ్‌ జరుగుతోంది. కాగా అపోలో హాస్పిటల్స్‌ అధినేత ప్రతాప్‌రెడ్డి కుమార్తె, చేవెళ్ల లోక్‌సభ స్ధానం నుంచి బరిలో నిలిచిన కాంగ్రెస్‌ అభ్యర్ధి కొండా విశ్వేశ్వరరెడ్డికి శోభనా కామినేని సమీప బంధువు కావడం గమనార్హం.

మరిన్ని వార్తలు