‘మంత్రి పదవి రానందుకు అసంతృప్తి లేదు’

11 Sep, 2019 08:30 IST|Sakshi
ఆరెకపూడి గాంధీ

సాక్షి, హైదరాబాద్‌: కేసీఆర్‌ కేబినెట్‌లో మంత్రి పదవి దక్కకపోవడంతో ఎలాంటి అసంతృప్తి లేదని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ తెలిపారు. అలకబూనిన ఎమ్మెల్యే గాంధీ, గన్‌మెన్‌లను పంపించారని మీడియాలో వచ్చిన కథనాలను ఆయన కొట్టి పారేశారు. తన మనవడిని చూసేందుకు గుంటూరుకు వెళ్లాలని నిర్ణయించుకోవడంతో రెండు రోజుల పాటు గన్‌మెన్‌లను వాపస్‌ పంపానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిన ప్రతిసారి గన్‌మెన్‌లను తీసుకొని వెళ్లాలంటే పోలీసుల అనుమతి తీసుకోవాలని ఆయన చెప్పుకొచ్చారు.

సోమవారం గుంటూరుకు వెళ్లేందుకు ప్రయాణమైన ఆయన నగర శివార్లలోకి వెళ్లగానే గన్‌మెన్‌లను పంపించారనే ప్రచారం జరగడంతో వెనుదిరిగి వివేకానందనగర్‌లోని తన ఇంటికి చేరుకున్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లిన ప్రతిసారి ఇలానే గన్‌మెన్‌లను పంపిస్తానని వివరించారు. తమ సామాజిక వర్గానికి చెందిన పువ్వాడ అజయ్‌కు మంత్రి పదవి ఇవ్వడం పట్ల ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు విధేయునిగా ఉంటానని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మంగళవారం కేటీఆర్‌ను కలిశానన్నారు. (చదవండి: గులాబీ పుష్పక విమానం.. ఓవర్‌ లోడ్‌!)

మరిన్ని వార్తలు