రీపోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

13 May, 2014 02:35 IST|Sakshi

 కొత్తగూడెం, న్యూస్‌లైన్: జిల్లాలోని కొత్తగూడెం, భద్రాచలం నియోజకవర్గాల్లో మంగళవా రం నిర్వహించనున్న సార్వత్రిక ఎన్నికల రీపోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ తెలిపారు. సోమవారం కొత్తగూడెంలోని సింగరేణి మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రీపోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని, ప్రశాంతంగా పోలింగ్ నిర్వహణకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. కొత్తగూడెంలోని 161వ పోలింగ్ బూత్ పరిధిలో మొత్తం 1008 ఓట్లు ఉన్నాయని, పాత కొత్తగూడెం, శ్రీరామచంద్ర స్కూల్‌లో పోలింగ్ నిర్వహిస్తామని చెప్పారు.

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు జిల్లాలో సజావుగా జరిగాయని, మంగళవారం నాటి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపునకు కూడా ఏర్పాట్లు పూర్తిచేశామని వివరించారు. భద్రాచలం నియోజకవర్గంలోని 8 మండలాల కౌంటింగ్‌ను భద్రాచలంలోనే ఏర్పాటు చేశామని, మిగిలినవన్నీ ఆయా మండల కేంద్రాల్లోనే ఏర్పాటు చేశామని తెలి పారు. కలెక్టర్ వెంట కొత్తగూడెం ఆర్డీవో డి.అమయ్‌కుమార్, డీఎస్పీ రంగరాజు భాస్కర్ తదితరులున్నారు.

 వీఆర్‌పురంలో కట్టుదిట్టమైన భద్రత
 వీఆర్‌పురం: రీపోలింగ్ జరగనున్న జల్లివారిగూడెం గ్రామంలో పోలీసులు, అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని ఏఎస్పీ ప్రకాష్‌రెడ్డి సోమవారం పరిశీలించారు. అక్కడి పరిస్థితులపై సీఐ అమృతరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. అలాగే పోలింగ్ సందర్భం గా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు.

మరిన్ని వార్తలు