రాష్ట్ర ప్రగతిని దెబ్బతీసేలా కథనాలు

18 Sep, 2014 00:29 IST|Sakshi
రాష్ట్ర ప్రగతిని దెబ్బతీసేలా కథనాలు

ప్రజలు ఆ రెండు పత్రికల వార్తలను నమ్మేంత అమాయుకులు కాదు 
మెదక్ విజయుమే అందుకు ఉదాహరణ: కేటీఆర్

 
హైదరాబాద్: మహిళా సాధికారతే ధ్యేయం గా తమ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ఐటీ, భారీ పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. తాజ్‌కృష్ణలో బుధవారం ఇండియన్ ఓషియన్ రిమ్ అసోసియేషన్ (ఐఓఆర్‌ఏ) ఏర్పాటు చేసిన వరల్డ్ ఎంపవర్‌మెంట్ పావర్టీ అండ్ అల్లెవేషన్ కార్యక్రమంలో కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా 15 దేశాల నుంచి మహిళా ప్రతినిధులు హాజరయ్యారని ఆయున అన్నారు. వీరు మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ జిల్లాల్లో పర్యటించి స్వయం సహాయక బృందాలు సాధించిన ప్రగతిని పరిశీలిస్తారని చెప్పారు. రెండు పత్రికలు రాష్ట్ర ప్రగతిని కుంటుపరిచేలా వార్తా కథనాలు ప్రచురిస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. మెదక్ ఉప ఎన్నికల్లో భారీ మెజా రిటీ ఇవ్వడం ద్వారా ప్రభుత్వం మీద తమకున్న నమ్మకాన్ని ప్రజలు తెలియజేశారని తెలిపారు. ఈ విజయాన్ని కప్పిపుచ్చడానికే కావాలని ఆ పత్రికలు మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన కథనాన్ని బ్యానర్‌గా ఇచ్చారని దుయ్యబట్టారు.

పథకం ప్రకారం నిరాధారపూరిత కథనాలు అల్లుతున్నాయన్నారు. ప్రజలు వాటిని నమ్మేంత అమాయకులు కారని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఈఓ ఎ.మురళి, ఐఓఆర్‌ఏ సెక్రటరీ అబ్దుల్లా, విదేశీ వ్యవహారాల ఉపకార్యదర్శి బ్రహ్మకుమార్, భారత ప్రభుత్వ గ్రామీణ అభివృద్ధి సంచాలకులు నీతా కేజ్రీవాల్, ఎన్‌ఆర్‌ఎల్‌ఎమ్ మిషన్ మేనేజర్ ధ్రువ్ జే సేన్‌గుప్తా, ఎం.యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు