డిసెంబర్‌ 7న కృత్రిమ అవయవాల పంపిణీ

21 Nov, 2019 10:12 IST|Sakshi
మాట్లాడుతున్న సబ్‌కోర్టు జడ్జి కిరణ్‌ మహి

సీనియర్‌ సిటిజన్లకు అవగాహన సదస్సు  

సబ్‌ కోర్టు జడ్జి కిరణ్‌ మహి 

సాక్షి, నిజామాబాద్‌: జిల్లా న్యాయసేవా సంస్థ ఆధ్వర్యంలో వచ్చేనెల డిసెంబర్‌ 7న వికలాంగులకు కృతిమ అవయవాలను పంపిణీ చేయనున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఇన్‌చార్జి కార్యదర్శి, సబ్‌కోర్టు సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎం. కిరణ్‌ మహి తెలిపారు. బుధవారం జిల్లా కోర్టు ఆవరణలో జడ్జి తన చాంబర్‌లో విలేకరులతో మాట్లాడారు. డిసెంబర్‌ 7న నగరంలోని బస్వాగార్డెన్‌(వినాయక్‌నగర్‌)లో పంపిణీ ఉంటుందన్నారు. వివిధ ప్రమాదాల్లో కాళ్లు, చేతులు కో ల్పోయిన వారికి కృతిమ అవయవాల పంపిణీ, చెవిటి వారికి వినికిడి మిషన్లు, వృద్ధులకు చేతికర్రలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు జడ్జి తెలిపారు. రోటరీ క్లబ్‌ ఆఫ్‌ నిజామాబాద్, లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ నిజామాబాద్, మున్సిపల్‌ కార్పొరేషన్, ఐసీడీఎస్, మెప్మా, ఎన్‌జీవోస్, రెవెన్యూ సిబ్బంది సహకారంతో చేస్తామన్నారు. దీనికిగాను ఎవరికి ఏం అవసరం ఉందో దాని గుర్తించి ఈనెల 25లోపు జిల్లా కోర్టులో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయ సూపరిం టెండెంట్‌కు దరఖాస్తులు ఇవ్వాలని కోరారు.
      
న్యాయ చట్టాలపై అవగాహన... 
డిసెంబర్‌ 7న బస్వాగార్డెన్‌లో సీనియర్‌ సిటిజన్లకు న్యాయ చట్టాలపై అవగాహన కల్పించినట్లు సబ్‌కోర్టు జడ్జి కిరణ్‌ మహి తెలిపారు. సీనియర్‌ సిటిజన్లకు న్యాయ చట్టాలు ఏం చెబుతున్నాయి అనే వివరాలపై అవగాహన జరుగుతుందన్నారు. కృతిమ అవయవాల పంపిణీ, అవగాహన సదస్సును ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన వారు సద్వినియోగం చేసుకోవాలని జడ్జి తెలిపారు.  

మరిన్ని వార్తలు