అసెంబ్లీ కమిటీలూ ముఖ్యమైనవే

7 Nov, 2019 03:49 IST|Sakshi

స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: ప్రజాస్వామ్యంలో చట్ట సభల తరహాలోనే శాసనసభ కమిటీలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుందని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వరంగ సంస్థల పనితీరును సమగ్రంగా పర్యవేక్షించడం కమిటీ ప్రధాన విధి అని స్పీకర్‌ పేర్కొన్నారు. బుధ వారం అసెంబ్లీ ఆవరణలో 2019–20 సంవత్సరపు ప్రభు త్వ రంగ సంస్థల కమిటీ (పీయూసీ) తొలి సమావేశం కమిటీ చైర్మన్‌ ఆశన్నగారి జీవన్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది.

స్పీకర్‌ పోచారం మాట్లాడుతూ.. ప్రభుత్వ సంస్థల పనితీరుకు సంబంధించిన నివేదికలు, లెక్కలను భారత కంపోŠట్రలర్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదికలను కమిటీ పరిశీ లిస్తుందన్నారు. రాష్ట్రం ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు, ప్రభుత్వ రంగ సంస్థలు ఆర్థికంగా పరిపుష్టం అయ్యేలా చూడాల్సిన బాధ్యత కమిటీపై ఉంటుందని శాసన మండ లి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల పనితీరు, అకౌంట్స్‌ విషయంలో అకౌంటెంట్‌ జనరల్‌ ఇచ్చే నివేదికల్లో లోటుపాట్లను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిస్తామని కమిటీ చైర్మన్‌ ఆశన్నగారి జీవన్‌రెడ్డి ప్రకటించారు. సమావేశంలో సభ్యులు విద్యాసాగర్‌రావు, ప్రకాశ్‌గౌడ్, అబ్రహం, శంకర్‌నాయక్, దామోదర్‌రెడ్డి, భాస్కర్‌రావు, పాషా ఖాద్రీ, కోరుకంటి చందర్, నారదాసు లక్ష్మణ్‌రావు, పురాణం సతీష్‌ పాల్గొన్నారు.  

హామీల అమలు బాధ్యత ఆ కమిటీదే..  
శాసన మండలి సభ్యులు ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తెచ్చే సందర్భంలో సీఎం, మంత్రులిచ్చే హామీలు అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత హామీల అమలు కమిటీపై ఉంటుందని మండలి చైర్మన్‌ సుఖేందర్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఆవరణలో హామీల అమలు కమిటీ చైర్మన్‌ గంగాధర్‌గౌడ్‌ అధ్యక్షతన జరిగిన 2019–20 హామీల అమలు కమిటీ తొలి సమావేశంలో గుత్తా పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు