పాత కాపులు.. కొత్త ముఖాలు

10 Jun, 2018 06:59 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల : ఏడాదిలోపే సార్వత్రిక ఎన్నికలు రానుండడంతో అన్ని పార్టీల నాయకులు పల్లెబాట పడుతున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలతో పాటు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతున్న నాయకులు ఇప్పటినుంచే పల్లెల్లో ప్లాట్‌ఫారం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రైతుబంధు వంటి పథకాలతో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు గ్రామాలకు క్యూ కడుతుండగా, ప్రభుత్వ వ్యతిరేక ప్రచారంతో విపక్షాలు అదే దారి పట్టాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల్లో రాజకీయ సందడి నెలకొంది. టీఆర్‌ఎస్‌లో సిట్టింగ్‌లకు పోటీగా కొత్త నాయకులు కూడా వివిధ మార్గాల్లో ప్రచారం చేసుకుంటున్నారు. కాంగ్రెస్‌లో ఎవరి ధీమాలో వారుంటూ ప్రజల మద్ధతు కోసం పోటీ పడుతున్నారు. బీజేపీ కూడా పట్టున్న ప్రాంతాల్లో పల్లె నిద్రలు సాగిస్తోంది. టీజేఎస్, సీపీఐ వంటి పార్టీల నేతలు కూడా ఎన్నికల సంవత్సరంలో అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడ్డారు. 

పల్లెలకు చేరిన మంచిర్యాల రాజకీయం
మంచిర్యాల నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో తిరిగి టిక్కెట్టు తనకే వస్తుందని సిట్టింగ్‌ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు భావిస్తుండగా, ఆయనకు చెక్‌ పెట్టేందుకు హైదరాబాద్‌ స్థాయిలో వ్యతిరేక వర్గం పనిచేస్తోంది. రాష్ట్ర టీవీ, చలన చిత్ర మండలి చైర్మన్‌ పుస్కూరు రామ్మోహన్‌రావు కూడా తనకే టిక్కెట్టు అనే ధీమాతో ఉన్నారు. ఆయనతో పాటు పలువురు  నాయకులు తాము సైతం పోటీలో ఉన్నట్టు చెప్పుకుం టున్నారు. కాంగ్రెస్‌ తరపున మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌రావు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇటీవల బస్సుయాత్ర విజయవంతంగా నిర్వహించి అధిష్టానం వద్ద మార్కులు కొట్టేశారు.

రంజాన్‌ సందర్భంగా ప్రభుత్వం ఇస్తున్న కానుకల తరహాలో ముస్లింలకు ‘పీఎస్‌ఆర్‌ రంజాన్‌ కా తోఫా’ పేరుతో వస్త్రాలు, బియ్యం, సేమియా తదితర కానుకలతో కూడి న కిట్‌లను అందజేసే కార్యక్రమాన్ని సొంత ఖర్చుతో నిర్వహిస్తున్నారు. వచ్చే బుధవారం మహిళలతో ఇఫ్తార్‌ పార్టీ ఏర్పాటు చేయించి పార్టీ రాష్ట్ర నాయకులను ఆహ్వా నించారు. మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవిందరెడ్డి సైతం ఇక్కడ కాంగ్రెస్‌ టిక్కెట్టు రేసులో ఉన్నా, పల్లెల బాట పట్టలేదు. బీజేపీ నుంచి జిల్లా పార్టీ అధ్యక్షుడు ముల్కల్ల మల్లారెడ్డి ఈసారి పోటీలో నిలవాలని నిర్ణయించుకున్నా రు. శనివారం రాత్రి హాజీపూర్‌ మండలం టీకానపల్లిలో మల్లారెడ్డి ‘పల్లెనిద్ర’ కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ జన సమితి ఇన్‌చార్జి గురుజాల రవీందర్‌రావు సంస్థాగతంగా పార్టీ అభివృద్ధి మీద దృష్టి పెట్టారు. 

చెన్నూర్‌లో కొత్త ముఖాలు.. 
చెన్నూర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న నల్లాల ఓదెలుకు మాజీ మంత్రి గడ్డం వినోద్‌ నుం చి పోటీ ఉన్నా, వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి న తనను కాదనరనే ధీమాతో ఉన్నారు. అన్ని పార్టీలు తిరిగి చివరికి కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి బోడ జ నార్దన్‌ ఈసారి హస్తం గుర్తు మీద పోటీ చేస్తానని చెపు తూ మండలాల్లో పర్యటిస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్‌ పార్టీలో చేరిన నేతకాని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం అశోక్‌ టిక్కెట్‌పై ధీమాగా ఉన్నారు. కరీంనగర్‌ ఎక్సైజ్‌ కమీషనర్‌గా పనిచేస్తున్న దుర్గం వెంకటేశ్‌ సైతం కాంగ్రెస్‌ టిక్కెట్‌ ఆశిస్తున్నారు. అయితే వీరెవెరూ ఇప్పటివరకు ప్రజల వద్దకు వెళ్లలేదు. బీజేపీ నుంచి పార్టీ జిల్లా ప్రధా న కార్యదర్శి అందుగుల శ్రీనివాస్, దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు రాంవేణు టిక్కెట్టు రేసులో ఉన్నారు. తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్‌కుమార్‌ ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటాలు చేస్తున్నారు. తెలంగాణ జన సమితి నుంచి పొడెటి సంజీవ్‌ టిక్కెట్‌ను ఆశిస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి గోమాస శ్రీనివాస్‌ పెద్దపల్లి లోక్‌సభ టిక్కెట్‌ ఆశిస్తున్నారు.

బెల్లంపల్లి సీటు కోసం పోటీ..
బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ పక్షాన సిట్టింగ్‌ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మరోసారి టిక్కెట్‌ ఆ శిస్తుండగా.. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రేణికుంట్ల ప్రవీణ్‌ సైతం ఇక్కడ టిక్కెట్‌ రేసులో ఉన్నారు. ఇద్దరు నే తలు పోటాపోటీగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కాంగ్రెస్‌ పక్షాన టీపీసీసీ సభ్యుడు చిలుముల శంకర్‌ పో టీకి సిద్ధపడుతున్నారు. ప్రజా గాయకుడు గద్దర్‌ కొడుకు సూర్యకుమార్‌ బెల్లంపల్లి నుంచి కాంగ్రెస్‌ తరపున పోటీ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. బెల్లంపల్లిలో కాంగ్రెస్‌ నిర్వహించిన ప్రజా చైతన్య యాత్రలో కూడా సూర్యకుమార్‌ పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు మద్దతుతో మున్సిపల్‌ వార్డు కౌన్సెలర్‌ రొడ్డ శారద పోటీ కి సిద్ధపడుతున్నారు. ఈమె కూడా గ్రామాల్లో పర్యటనలను ప్రారంభించారు. సీపీఐ పక్షాన మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్‌ ఇటీవల కాలంలో వివిధ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ఠ్ర కార్యవ ర్గ సభ్యుడు కొయ్యల ఏమాజీ పల్లెనిద్ర ద్వారా ప్రజలతో కలిసిపోతున్నారు. టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన దుర్గం గోపాల్‌ టీజేఎస్‌ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు.

కుమురం భీం జిల్లాలో పోటాపోటీగా ప్రజల్లోకి.. 
ఆసిఫాబాద్‌లో టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రజలతో సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఆమె నిర్మించిన గృహం విషయంలో విపక్షాల నుంచి విమర్శలు పెరుగుతుండడం ఇబ్బందిగా మారింది. కాంగ్రెస్‌ నుం చి మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ప్రజల్లో తన గ్రాఫ్‌ను పెంచుకున్నారు. ఆదివాసీ ఉద్యమంలో కీలకనేతగా ప్రజల మద్దతు కూడగట్టుకున్నారు. ఆదివాసీల హక్కుల పేరుతో గ్రామాల్లో పర్యటిస్తుండడం కలిసివచ్చే అంశం. బీజీపీ నుంచి ఓ ప్రభుత్వ గురుకుల పాఠశాల వార్డెన్‌ పోటీ చేసే ఆలోచనతో స్వచ్ఛంద పదవీ విరమణ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. సిర్పూర్‌లో టీఆర్‌ఎస్‌ తరుపున కోనేరు కోనప్ప తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మ య్య ప్రజలకు సన్నిహితం కాలేకపోతున్నారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే దివంగత పాల్వాయి పురుషోత్తంరావు తనయుడు పాల్వాయి హరీశ్‌ గత కొద్ది రోజులుగా పల్లెబాట పేరుతో పాదయాత్రలు చేస్తూ ప్రజల అభిమానం చూరగొనే ప్రయత్నాల్లో ఉన్నారు. బీజేపీలో ఇటీవల చేరిన డాక్టర్‌ కొత్తపల్లి శ్రీనివాస్‌ సేవా కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళుతున్నారు. కాంగ్రెస్‌లో రావి శ్రీనివాస్, గోసుల శ్రీనివాస్‌ యాదవ్, సిడాం గణపతి తమ పట్టును పెంచుకునే ప్ర యత్నాల్లో ఉన్నారు. జెడ్పీ మాజీ చైర్మన్‌ సిడాం గణపతి ఆదిలాబాద్‌ ఎంపీగా పోటీ చేసే యోచనతో ఉన్నారు.

ఆదిలాబాద్‌ కాంగ్రెస్‌లో మూడు ముక్కలాట..
ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో అధికార టీఆర్‌ఎస్‌లో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్నదే హవా. కాంగ్రెస్‌ పార్టీ నుంచి మాజీ మంత్రి సి.రాంచంద్రారెడ్డి, ఏఐ సీసీ సభ్యురాలు గండ్రత్‌ సుజాత, భార్గవ్‌దేశ్‌ పాండే టిక్కెట్టును ఆశిస్తున్నారు. ముగ్గురు రేసులో ఉంటూ, మూడు వర్గాలుగా పని చేస్తుండడం గమనార్హం. బీజేపీ నుంచి పాయల్‌ శంకర్‌ టిక్కెట్టును ఆశిస్తూ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. హోమి యోపతి వైద్యుడు డాక్టర్‌ రవికిరణ్‌ యాదవ్‌ ఈ ఎన్నికల్లో బరిలోకి దిగే అవకాశం ఉంది. తెలంగాణ జన సమి తి నుంచి దుర్గం రాజేశ్వర్, వై.సంజీవ్‌రెడ్డి, సామల ప్రశాంత్‌ టిక్కెట్టు ఆశిస్తున్నారు. బోథ్‌ నియోజకవర్గంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావు మరోసారి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తుండగా.. ప్రస్తుతం ఆదిలా బాద్‌ ఎంపీగా ఉన్న గోడం నగేశ్‌ బోథ్‌ నుంచి పోటీ చేస్తారని ప్రచారంలో ఉంది. ఇరువురి మధ్య విభేదాలు నెలకొన్నా ఇటీవలి కాలంలో కలిసికట్టుగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం ఆసక్తి కలిగిస్తోంది.

బోథ్‌లో కాంగ్రెస్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే, ఆదివాసీ నాయకులు సోయం బాపూరావు, కిందటి ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన అనిల్‌జాదవ్‌ టికెట్‌ను ఆశిస్తున్నారు. ఎవరికి వారే తమ మద్దతుదారులతో సమావేశాలు జరుపుతూ టిక్కె ట్టు రేసులో ఉన్నారు. ఖానాపూర్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యే రేఖానాయక్, మాజీ ఎంపీ రాథోడ్‌ రమేశ్‌ టికెట్‌ను ఆశిస్తున్నారు. ఆదివాసీ ఉద్య మం నేపథ్యంలో నియోజకవర్గంలో పరిస్థితులు ఎలా ఉంటాయనేది ఉత్కంఠ ఉంది. కాంగ్రెస్‌ నుంచి కిందటిసారి పోటీ చేసిన హరినాయక్‌తో పాటు భరత్‌చౌహాన్‌ టికెట్‌ను ఆశిస్తున్నారు. ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన నరేశ్‌జాదవ్‌ ఈ ఎన్నికల్లోనూ పోటీలో నిలవాలని ఆసక్తిగా ఉన్నారు. అయితే జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న ఆదివాసీ ఉద్యమం కొంత మంది రాజకీయ నాయకుల భవిష్యత్తుకు ఆగా«థం సృష్టించే అవకాÔశం ఉంది. 

నిర్మల్‌ జిల్లాలో సీనియర్లు.. జూనియర్లు.. 
నిర్మల్‌ జిల్లాలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి ఎదురులేని పరిస్థితి కనిపిస్తోం ది. కాంగ్రెస్‌లో డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పూర్వవైభవం కోసం ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్‌ బస్సుయాత్రను మహేశ్వర్‌రెడ్డి పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. యాత్ర కన్వీనర్‌గా వ్యవహరించడంతో పాటు నిర్మల్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించి విజయవంతం చేశారు. శుక్రవారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన భారీ ఇఫ్తార్‌ విందుకు సైతం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ, మండలి నేతలు జానారెడ్డి, షబ్బీర్‌ అలీలను రప్పించి క్యాడర్‌లో జోష్‌ నింపారు. బీజేపీ తరపున వైద్యురాలు అయిండ్ల స్వర్ణారెడ్డి, ఇటీవల పార్టీలో చేరిన వైద్యుడు కాలగిరి మల్లికార్జున్‌రెడ్డి సొంతంగా కార్యక్రమాలు చేపడుతూ ప్రజల మధ్యకు వెళుతున్నారు. సీనియర్లు అయ్యన్నగారి భూమయ్య, రావుల రాంనాథ్‌ సైతం పార్టీ టికెట్‌ రేసులో ఉన్నారు.

తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు లోలం శ్యాంసుందర్‌ పలువురు నేతలు మాత్రమే అడపదడపా కార్యక్రమాలను నిర్వహిస్తున్నా, ఉనికి నామమాత్రంగా తయారైంది. ముథోల్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి ఈసారి కారు గుర్తు మీద పోటీ చేసేందుకు సన్నద్ధమయ్యారు. కాంగ్రెస్‌ టికెట్‌ కోసం పోటీపడుతున్న నాయకులు ప్రజల మద్దతు కోసం విస్తృతంగా పర్యటిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే బోస్లే నారాయణరావుపటేల్, ఆయన సోదరుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త బోస్లే మోహన్‌రావుపటేల్‌ పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరో నేత పవార్‌ రామారావుపటేల్‌ అనసూయపవార్‌ ట్రస్ట్‌ పేరిట గత కొన్నేళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిర్మల్‌ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు పడకంటి రమాదేవి ముథోల్‌ నుంచి పోటీచేస్తానని ప్రకటించారు. పల్లెనిద్రలో భాగంగా ఇప్పటికే దళితవాడల్లో కార్యక్రమాలు చేపడుతున్నారు. టీడీపీ నుంచి ఈ ఎన్నికల్లో బోయిడి విఠల్‌ బరిలో దిగనున్నారు.

మరిన్ని వార్తలు