కరోనాపై పోరాటానికి అస్త్రం

20 May, 2020 06:48 IST|Sakshi
మిత్ర, మిత్రి రోబోలతో కొత్తగా తయారైన అస్త్ర (ఎడమ)

దేశీయ పరిజ్ఞానంతో ‘అస్త్ర రోబో’ 

ఇప్పటికే ‘మిత్ర, మిత్రి’ అందుబాటులోకి.. 

మాల్స్, కార్యాలయాలను యూవీ కిరణాలతో శుద్ధి చేస్తాయి..

15 నిమిషాల్లోనే పరిసరాలన్నీ డిస్‌ఇన్ఫెక్షన్‌

 ‘సాక్షి’తో ఇన్వెంటో రోబోటిక్స్‌ సంస్థ  చీఫ్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ భరత్‌ 

సాక్షి, హైదరాబాద్‌: కరోనా మహమ్మారి ఉధృతి పెరిగి, వైరస్‌ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో కొత్త ‘అస్త్రం’అందుబాటులోకి వచ్చింది. మన పరిసరాల్లోకి వైరస్‌ ప్రవేశించిందా అన్న అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు ఈ అస్త్రం ఉపయోగపడనుంది. సీ–అస్త్ర యూవీ–సీ రేడియేషన్‌ రోబోను ఇన్వెంటో రోబోటిక్స్‌ సంస్థ అతి త్వరలో ఆవిష్కరించనుంది. ఇప్పటికే మిత్ర, మిత్రి రోబోలను తయారుచేసింది. మొత్తం డిజైన్, ఉత్పత్తి, సర్వీసు మొత్తం మనదేశంలోనే తయారు కావడం విశేషం. 

ఏం చేస్తుంది? 
ఆస్పత్రులు, బ్యాంకులు, కార్యాలయాలు, కాంప్లెక్సుల్లోకి వస్తుంటారు. ఒకవేళ ఎవరైనా వైరస్‌ బారిన పడిన వారు వస్తే.. అక్కడి పరిసరాలకు వైరస్‌ అంటుకుంటుంది. అలాంటి వైరస్‌ను రోబో తనంతట తాను వెళ్లి అల్ట్రా వయొలెట్‌ కిరణాలతో నశింపజేస్తుంది. బ్యాక్‌ ఎండ్‌లో కాల్‌సెంటర్‌ మాదిరిగా పైలట్‌తో కనెక్ట్‌ అయ్యి అది ఎక్కడైనా చిక్కుకుపోయినా, ఏదైనా సమస్య వచ్చినా లేదా ఆగిపోయినా దాన్ని అ«ధిగమించేందుకు అనువుగా ఈ ‘అస్త్ర’రోబోను రూపొందించారు. దాదాపు మూడేళ్ల కింద హైదరాబాద్‌లో ‘గ్లోబల్‌ ఎంట్రప్రెన్యూర్‌ సమిట్‌’(జీఈఎస్‌)లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ట్రంప్‌తో కలసి పూర్తిగా భారత్‌లోనే తయారైన ‘మిత్ర’రోబోను ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించిన విషయం తెలిసిందే.

ఈ రోబోను రూపొందించిన ఇన్వెంటో రోబోటిక్స్‌ అభివృద్ధి సంస్థనే సీ–అస్త్ర యూవీ–సీ రేడియేషన్‌ రోబోను కూడా రూపొందించింది. మిత్ర రోబో అనంతరం మిత్రి రోబోను రూపొందించారు. దాదాపు నాలుగేళ్ల నుంచి భరత్‌కుమార్‌ దండు తన ఇద్దరు స్నేహితులు బాలాజీ విశ్వనాథన్, మహాలక్ష్మి రాధాకృష్ణన్‌లతో కలసి భారత్‌లోనే రోబోల తయారీ, వాటి సర్వీస్, స్పేర్‌పార్టులు, ఇతర సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. 

దేశీయంగా రూపొందించాం
మిత్రలో చాలా వెర్షన్లున్నాయి. ఇందులో మెడికల్‌ అప్లికేషన్‌ కోసం తయారు చేసిన స్క్రీనింగ్‌ రోబో. ఇది ఆ స్పత్రికి వచ్చిన పేషంట్లను కరోనా సంబంధించిన ప్రశ్నలు అడిగి శరీర ఉష్ణోగ్రతను పరీక్షించి, ఇవన్నీ సరి గ్గా ఉంటే లోపలికి పంపిస్తుంది. ఇది స్క్రీనింగ్‌ రోబో. కొత్తది అస్త్ర, మిత్ర ఫ్రెండ్‌ అయితే అస్త్ర ఆయుధంగా డిస్‌ఇన్ఫెక్షన్‌ చే స్తుంది. ఇది సొంతంగా తిరుగుతుంది. ఒక గదిని యూవీ కాంతితో 15 నిమిషాల్లో శుభ్రం చేస్తుంది. మనుషులు రోజంతా తిరిగాక, రాత్రి సమయంలో మొత్తం ప్రదేశాన్ని డిస్‌ఇన్ఫెక్ట్‌ చేస్తుంది. మిత్రతో పాటు మిత్రికి కూడా సేమ్‌ ఫీచర్లుంటాయి. మిత్రిలో మనుషులను గుర్తించి, ఫేస్‌ డిటెక్షన్‌ చేసి వీడియో కాల్‌ కూడా చేసే అవకాశముంటుంది. అటనామస్‌ నావిగేషన్‌తో పాటు భారతీయ భాషల్లో బదులిచ్చే ఏర్పాటు చేస్తున్నాం. వివిధ దేశాల నుంచి 30 వరకు ఆర్డర్లు వచ్చాయి. 
– భరత్, ఇన్వెంటో రోబోటిక్స్‌ చీఫ్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ 

మరిన్ని వార్తలు