వడ్డీ వ్యాపారి వేధింపులు తాళలేక..

23 Jun, 2016 16:33 IST|Sakshi

కరీమాబాద్ (వరంగల్) : వడ్డీ వ్యాపారి వేధింపులు తాళలేక ఓ ఆటో డ్రైవర్ బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. తీవ్ర రక్తస్రావం జరిగిన అతన్ని ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ సంఘటన వరంగల్ నగరంలోని కరీమాబాద్‌లో గురువారం జరిగింది. స్థానికంగా నివాసముంటున్న పిట్ట వినోద్(25) కామునిపేట ప్రాంతానికి చెందిన అంగన్‌వాడి ఆయా బత్తిని స్వరూప వద్ద కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాడు.

ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న వినోద్ సకాలంలో డబ్బులు తిరిగి చెల్లించలేకపోవడంతో.. స్వరూప తన మనుషులతో వినోద్ ఇంటి ముందు గొడవ చేసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వినోద్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో బ్లేడుతో గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గుర్తించిన స్థానికులు అతన్ని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

మరిన్ని వార్తలు