ఎట్టకేలకు ఇంటికి చేరిన ఆటోడ్రైవర్‌ కుటుంబం 

14 Apr, 2020 08:56 IST|Sakshi

‘సాక్షి’కథనానికి స్పందించిన అధికారులు  

గ్రామస్తులకు కౌన్సెలింగ్‌ 

డ్రైవర్‌ కుటుంబానికి నిత్యావసర సరుకులు అందజేసిన తహసీల్దార్‌ 

హన్మకొండ అర్బన్‌: హన్మకొండలో అద్దెకు ఉంటున్న ఆటోడ్రైవర్‌ రాజేందర్‌ దంపతులు ఎట్టకేలకు సోమవారం తమ స్వగ్రామం రాయపర్తి మం డలం ఊకల్‌ బాలాజీ తండాకు చేరుకున్నారు. రెండు రోజుల పాటు చంటి బిడ్డతో తాము అనుభవించిన నరకయాతనను అధికారుల దృష్టికి తీసుకువచ్చి అండగా నిలిచిన ’సాక్షి’కి వారు కృతజ్ఞతలు తెలిపారు. ‘36 గంటల నరకం’శీర్షికన ‘సాక్షి’ప్రధాన సంచికలో రాజేందర్‌ కుటుంబ వెతలపై కథనం ప్రచురితమైన విషయం విదితమే.
(చదవండి : 36 గంటల నరకం.. )

ఈ కథనం వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్‌ జిల్లాల అధికార యంత్రాంగం లో చర్చనీయాంశమైంది. ఇలాంటివి జరగకుండా సమన్వయంతో పనిచేయాలని రాయపర్తి ఎస్‌ఐ వెంకటేశ్వర్లుకు ఉన్నతాధికారులు సూచించారు. ఆదివారం రాత్రి రాయపర్తి చేరుకున్న రాజేందర్‌ కుటుంబానికి స్థానిక గురుకులంలో అధికారులు బస ఏర్పాటుచేసి భోజనం అందించారు. రాయపర్తి తహసీల్దార్‌ సత్యనారాయణ ఆధ్వర్యంలో వైద్య, పోలీసు అధికారులు బాలాజీ తండాకు వెళ్లి స్థానికులతో మాట్లాడి అవగాహన కల్పించాక రాజేందర్‌ కుటుంబాన్ని ఇంటికి చేర్చి, 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. వాస్తవ పరిస్థితిని తమ దృష్టికి తీసుకువ్చనందుకు హన్మకొండ ఏసీపీ జితేందర్‌ రెడ్డి ‘సాక్షి’ని అభినందించారు.

>
మరిన్ని వార్తలు