హాజరు కాకుంటే సస్పెన్షనే: కలెక్టర్ రొనాల్డ్ రాస్

6 Feb, 2016 20:07 IST|Sakshi

సంగారెడ్డి రూరల్ (మెదక్) : ఈ నెల 13న నారాయణఖేడ్ శాసనసభ నియోజకవర్గ స్థానం ఉప ఎన్నికల పోలింగ్ విధులకు ఉద్యోగులు హాజరు కాకపోతే సస్పెండ్ చేస్తామని మెదక్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రాస్ హెచ్చరించారు. ఎన్నికల విధులు కేటాయించబడిన ఉద్యోగులు తగిన కారణాలు లేకుండా సబ్‌స్టిట్యూట్‌ను ప్రతిపాదించడం సమంజసం కాదన్నారు. ఉప ఎన్నికకు సంబంధించి సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లిలోని పీఎస్‌ఆర్ గార్డెన్‌లో పోలింగ్ అధికారులకు, సహాయ పోలింగ్ అధికారులకు రెండో విడత అవగాహన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఈవీఎంల పనితీరుపై పోలింగ్ అధికారులకు, సహాయ పోలింగ్ అధికారులకు పూర్తి అవగాహన ఉండేందుకు ఈ శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. అధికారులు ఎన్నికల నియమ, నిబంధనలను తప్పకుండా పాటించాలని ఆయన సూచించారు. ఈ అవగాహన కార్యక్రమంలో మైక్రో అబ్జర్వర్లకు కూడా పర్యవేక్షణపై అవగాహన కల్పించారు.

మరిన్ని వార్తలు