పోలీసులకు స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌పై అవగాహన

13 Jun, 2018 10:37 IST|Sakshi
 కార్యక్రమంలో మాట్లాడుతున్న వైద్య నిపుణులు 

జిల్లా ఎస్పీ చందనాదీప్తి 

మెదక్‌ మున్సిపాలిటీ: పని ఒత్తిడితో ఇబ్బందులకు గురవుతున్న పోలీసులకు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఎస్పీ చందనాదీప్తి తెలిపారు. మంగళవారం మెదక్‌ జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అధికారులకు స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌పై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ అధికారులు ప్రతిరోజు పని ఒత్తిడికి  గురవుతుంటారని, వీరికి మానసిక ప్రశాంతత అవసరమన్నారు. ఈ ఒత్తిళ్లను అధిగమించడానికి ఈ స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌ తరగతులన్నారు. ఈ సందర్భంగా మానసిక వైద్య నిపుణులు డాక్టర్‌ నీలేష్‌ డార్ఫే మాట్లాడుతూ పోలీసు సిబ్బందికి అనేక రకాలుగా ఒత్తిళ్లుంటాయని, వాటి వల్ల మానసిక ప్రశాంతత కోల్పోవడం జరుగుతుందన్నారు.

కాబట్టి ఒత్తిడిని అధిగమించడం ఎంతైన అవసరమన్నారు. ఇందుకోసం ప్రతిరోజు యోగా, నడక, ప్రాణాయాణం, మెడిటేషన్, పాజిటీవ్‌ ఆలోచనలు, కుటుంబ సభ్యులతో సమయం గడపడం వంటివి చేయాలన్నారు. వీటి వల్ల చాలా వరకు ఒత్తిడిని అధిగమించవచ్చునని తెలిపారు.

ఈ నియమాలు పాటించి అందరూ వ్యాధులను తరిమి కొట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నాగరాజు, డాక్టర్‌ ప్రియాంక, తూప్రాన్‌ డీఎస్పీ రాంగోపాల్‌రావు, సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది, కానిస్టేబుల్స్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు