లారీ ఢీకొని బీటెక్‌ విద్యార్థిని దుర్మరణం

28 Jan, 2019 08:12 IST|Sakshi

నాగోలు: అతివేగంతో వచ్చిన లారీ ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిడడంతో బైకు వెనుక కూర్చున్న విద్యార్థిని లారీ వెనుక చక్రాల కిందపడి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఎల్‌బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. న్యూనాగోలు కాలనీ చెందిన సతనపల్లి రామబ్రహ్మం, కల్పనల కూతురు నవ్యశ్రీ(20) మోహన్‌నగర్‌ ప్రజానివాస్‌ పేజ్‌–2కు చెందిన కీర్తికుమార్‌రెడ్డి కూతురు సాతన(20) స్నేహితులు. వీరు తట్టిఅన్నారం సమీపంలోని శ్రేయాస్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ చివరి సంవత్సరం చదువుతున్నారు. ఆదివారం పనుల నిమిత్తం హోండా యాక్టివా(టీఎస్‌08ఈడబ్ల్యూ 6092)పై ఇద్దరూ కళాశాలలో పనినిమిత్తం బయలుదేరారు. 

బండ్లగూడ ఆర్టీసీ డిపో దాకా వచ్చాక ఆదివారం కాలేజీలో ఎవరూ ఉండకపోవచ్చని భావించి తిరుగు పయనమయ్యరు. సాతన బైక్‌ నడుపుతుండగా నవ్యశ్రీ వెనుక కూర్చుంది. బండ్లగూడ, ఆనంద్‌నగర్‌ సమీపంలోని రాజీవ్‌ స్వగృహ సముదాయాల వద్దకు రాగానే తట్టిఅన్నారం వైపు నుంచి వేగంగా వచ్చిన లారీ (కేఈ 56–1017) వీరి బండిని వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నవ్యశ్రీ లారీ వెనుక చక్రాల కింద పడి అక్కడిక్కడే మరణించింది. సాధన ఎడమ వైపు పడడంతో ప్రాణాలతో బయటపడింది. విషయం తెలిసిన నవ్యశ్రీ తల్లి, స్నేహితులు తల్లడిల్లారు. ఒక్కగానొక్క కూతురు ప్రమాదంలో మృతి చెందడంతో వారిని ఓదార్చడం సాధ్యం కాలేదు. ఈ ప్రమాదంతో ఆనంద్‌నగర్‌ నుంచి తట్టిఅన్నారం మార్గంలో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఎల్‌బీనగర్‌ సీఐ అశోక్‌రెడ్డి సిబ్బందితో అక్కడికి చేరుకునిట్రాఫిక్‌ క్లియర్‌ చేశారు. నవ్యశ్రీ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ సాజిద్‌ను పోలీసులు అదుపులో ఉన్నట్లు సమాచారం. సాతన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు