‘బ్యాక్‌లాగ్స్’ సమస్యను పరిష్కరించండి: హైకోర్టు

20 Dec, 2014 01:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కోర్సుల్లో 12, అంత కంటే ఎక్కువ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించని (బ్యాక్ లాగ్స్) విద్యార్థులను తదుపరి సంవత్సరానికి ప్రమోట్ చేయడానికి విశ్వవిద్యాలయం అధికారులు నిరాకరిస్తున్న నేపథ్యంలో... ఈ సమస్యకు ఓ పరిష్కారం చూడాలని ఉస్మానియా వర్సిటీ అధికారులను హైకోర్టు ఆదేశించింది.

విద్యార్థులు విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా ఉండేందుకు క్షేత్రస్థాయిలో వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని ఆచరణీయమైన నిర్ణయాన్ని తీసుకోవాలని యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కు సూచించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం గతవారం ఉత్తర్వులు జారీ చేసింది.

12 అంతకంటే ఎక్కువ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించని తమను తదుపరి సంవత్సరానికి ప్రమోట్ చేయడానికి యూనివర్సిటీ అధికారులు నిరాకరించడాన్ని సవాలు చేస్తూ పెద్ద సంఖ్యలో ఇంజనీరింగ్ విద్యార్థులు గతనెలలో హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.వాదనలు విన్న హైకోర్టు  సమస్యను పరిష్కరించాలని ఆదేశించింది.
 

మరిన్ని వార్తలు