పాపన్నపేట(మెదక్): బడీడు పిల్లలంతా బడిలో ఉండేలా అవగాహన కల్పించేందుకు.. విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల వైపు మళ్లించేందుకు విద్యాశాఖ ‘బడిబాట’కు మరోసారి సన్నద్ధమైంది. ఈనెల 14 (శుక్రవారం) నుంచి 19 వరకు పండుగ వాతావరణంలో ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించేం దుకు ఆదేశాలిచ్చింది. ఇటీవల పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ బడులు సాధించిన మెరుగైన ఫలితా లను విస్తృతంగా ప్రచారం చేసి నమోదు శాతం పెంచేందుకు పక్కా ప్రణాళిను అమలు చేయబోతున్నారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు, ఉపాధ్యాయులకు సన్మానాలు చేయనున్నారు. ప్రభుత్వ బడిని బతికించుకునేందుకు ప్రైవేటును తలదన్నే ప్రచార వ్యూహాలు సిద్ధం చేశారు. ప్రతి గ్రామంలో ‘గ్రామ విద్యా రిజిస్టర్’ (ఏఈఆర్)తప్పకుండా నిర్వహించాలని తద్వారా బడి బయట ఉన్న విద్యార్థుల వివరాలు గుర్తించవచ్చని భావిస్తున్నారు.
బడీడు పిల్లలు బడిలో ఉండడమే ఉద్దేశం..
ప్రభుత్వ బడుల్లో నమోదు శాతం పెంచేందుకు దశాబ్ద కాలంగా విద్యాశాఖ బడిబాట కార్యక్రమాన్ని చేపడుతోంది. విద్యాసంవత్సరం ఆరంభం నుంచి వారం రోజుల పాటు నిర్దేశించిన షెడ్యూల్ కనుగుణంగా పండుగ వాతావరణంలో బడిబాట నిర్వహిస్తున్నారు. జిల్లాలో 902 ప్రభుత్వ పాఠశాలలుండగా సుమారు 83 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇప్పటికీ కొంత మంది పిల్లలు అక్కడక్కడ ఇటుక బట్టీల్లో.. యాచక వృత్తిలో.. పశువుల కాపరులుగా.. హోటళ్లు, కిరాణ దుకాణాల్లో బాల కార్మికులుగా బతుకీడుస్తున్నారు.
బడీడు గల పిల్లలందరినీ బడిలో చేర్పించడం.. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం ‘బడిబాట’ ప్రధాన ఉద్దేశం. అందుకే అంగన్వాడీ పూర్తి చేసిన పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించడం.. బాలికల విద్యను ప్రోత్సహించడం.. హాజరు నమోదు తక్కువగా ఉన్న పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టడం.. పోషకుల సమావేశం నిర్వహించడం.. గుణాత్మక విద్యా సాధనకు చేస్తున్న కృషి వివరించి స్వచ్ఛంద సంస్థలు, పూర్వ విద్యార్థులు, గ్రామ పెద్దలు, దాతల సాయాన్ని తీసుకొని పాఠశాల అభివృద్ధికి పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకోవడం, పదో తరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థులను, ఉపాధ్యాయులను సన్మానించడం లాంటివి ప్రాధాన్య అంశాలుగా గుర్తించారు. 10 జీపీఏ సాధించిన విద్యార్థులు, హెచ్ఎంలతో కలసి కలెక్టర్ ధర్మారెడ్డి, జేసీ నగేశ్, డీఈఓ రవికాంత్రావు ఇప్పటికే విందు కార్యక్రమాన్ని పూర్తి చేశారు.
బడిబాట షెడ్యూల్ ..