క్షేమంగానే ఉన్నా: బాజిరెడ్డి

18 Jun, 2020 12:46 IST|Sakshi

కరోనా జాగ్రత్తలు పాటించండి

అనుచరులకు ఎమ్మెల్యే పిలుపు

డిచ్‌పల్లి: తాను క్షేమంగానే ఉన్నానని, త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తానని నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ ధీమా వ్యక్తం చేశారు. తన ఆరోగ్యం గురించి అనుచరులు, అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. బాజిరెడ్డికి ఇటీవల కరోనా పాజిటివ్‌ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. బుధవారం ఓ వీడియో విడుదల చేశారు. ‘నా గురించి ఎవరూ ఆందోళన చెందవద్దు. నేను, నా శ్రీమతి ఆరోగ్యంగానే ఉన్నాం. నా శ్రేయస్సు కోసం, మా కుటుంబ సభ్యుల కోసం పూజలు చేస్తున్న కార్యకర్తలకు, అభిమానులకు పేరు పేరున ధన్యవాదాలు. మీ అందరి ఆశీస్సులతో ఆరోగ్యంగా తిరిగి వస్తానని’ వీడియోలో పేర్కొన్నారు. తనకు ధైర్యం ఉందని, తన ధైర్యం ఎలాంటిదో మీ అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. 

మరిన్ని వార్తలు