రికార్డు ధర పలికిన బాలాపూర్‌ లడ్డూ

23 Sep, 2018 10:11 IST|Sakshi

సాక్షి, బడంగ్‌పేట్‌‌: బాలాపూర్‌ గణేషుని లడ్డూ ఈ ఏడాది రికార్డు ధర పలికింది. వేలం పాటలో రూ. 16లక్షల 60వేలకు శ్రీనివాస్‌ గుప్తా (ఆర్యవైశ్య సంఘం) లడ్డూను సొంతం చేసుకున్నారు. గతేడాదితో పొలిస్తే బాలాపూర్‌ లడ్డూ లక్ష రూపాయలు అధికంగా పలికింది. భారీగా తరలివచ్చిన భక్తుల సమక్షంలో లడ్డూ వేలం పాట కన్నుల పండుగగా జరిగింది.

గణపతి నవరాత్రి ఉత్సవాల్లో బాలాపూర్‌ గణపయ్యది ఓ ప్రత్యేకమైన స్థానం. ఇక్కడి వినాయకుని లడ్డూకు విపరీతమైన క్రేజ్‌ ఉంటుంది. లడ్డూ దక్కించుకునేందుకు పోటీ పెద్ద ఎత్తున ఉంటుందనే సంగతి తెలిసిందే. దీనిని దక్కించుకోవడానికి పలు రంగాలకు చెందిన ప్రముఖలు ఈ వేలం పాటలో పాల్గొంటారు.

బాలాపూర్‌ గణనాథుడి ప్రస్థానం 1980లో ప్రారంభమైనప్పటికీ అయితే 1994 నుంచి లడ్డూ వేలంపాట మొదలైంది. 1994లో రూ.450 పలికిన తొలి లడ్డూ... 2017లో రూ.15.60 లక్షలకు చేరుకుంది. మరి ఈసారి ఎంత ధర పలుకుతుందోనని భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

లడ్డూ ఫ్రమ్‌ తాపేశ్వరం...  
బాలాపూర్‌ లడ్డూను తొలుత చార్మినార్‌లోని గుల్‌జల్‌ ఆగ్రా స్వీట్‌ హౌస్‌ వారు తయారు చేసేవారు. బరువు 21 కిలోలు ఉండేది. అయితే గత నాలుగేళ్లుగా అంతే బరువుతో తాపేశ్వరంలోని హనీ ఫుడ్స్‌ లడ్డూను తయారు చేస్తోంది. వేలంపాట విజేతకు లడ్డూను ఉంచే రెండు కిలోల వెండి గిన్నెను ఇస్తున్నట్లు హనీ ఫుడ్స్‌ అధినేత ఉమామహేశ్వర్‌ తెలిపారు. 

15లక్షల రూపాయలు పలికిన ఫిలింనగర్‌ గణపతి లడ్డూ
ఫిలింనగర్‌లో గణపతి లడ్డూ వేలం పాటు పోటాపోటీగా జరిగింది. యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన లడ్డూ వేలానికి భారీ స్పందన వచ్చింది. ఈ వేలంలో మేఘనా కన్‌స్ట్రక్షన్స్‌ 15 లక్షల రూపాయలకు వినాయకుడి లడ్డూ సొంతం చేసుకుంది. 

మరిన్ని వార్తలు