రేపు నల్ల జెండాల ఎగురవేత

15 May, 2020 04:05 IST|Sakshi

పోతిరెడ్డిపాడు విషయంలో రాష్ట్ర వైఖరిపై బీజేపీ మండిపాటు

సాక్షి, హైదరాబాద్‌: పోతిరెడ్డిపాడు జీవో 203 విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై బీజేపీ కోర్‌ కమిటీ మండిపడింది. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా గురువారం కోర్‌ కమిటీ సభ్యులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పోతిరెడ్డిపాడు, రైతుల ఆందోళన తదితర అంశాలపై కోర్‌ కమిటీ చర్చించింది. పోతిరెడ్డిపాడు విషయంలో నిబంధనలకు వ్యతిరేకంగా జారీ చేసిన జీవో పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న టీఆర్‌ఎస్‌ వైఖరికి నిరసనగా ఈనెల 16వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు తమ ఇళ్లపై నల్ల జెండాలు ఎగురవేయాలని పిలుపునిచ్చింది.

తాను చెప్పిన పంటలు వేస్తేనే రైతుబంధు డబ్బులు ఇస్తానంటూ సీఎం కేసీఆర్‌ రైతులను మోసం చేస్తున్నారని పేర్కొంది. ఆ పథకాన్ని ఎగ్గొట్టడానికే సీఎం ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని, ఇలాంటి ప్రకటనలతో సీఎం రైతులకు శత్రువుగా మారుతున్నారని ఆరోపించింది. రైతులకు, కార్మికులకు, చిరు వ్యాపారులకు, మధ్యతరగతి ప్రజలకు భరోసా నింపేలా ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని మోదీకి కోర్‌కమిటీ ధన్యవాదాలు తెలిపింది. 

మరిన్ని వార్తలు