సంయుక్త విజేతలుగా నేపాల్, బంగ్లాదేశ్‌

4 Jan, 2020 10:16 IST|Sakshi
ఉమ్మడి విజేతలుగా నిలిచిన బంగ్లాదేశ్, నేపాల్‌ జట్లకు ట్రోఫీ అందజేసిన మంత్రి పువ్వాడ

వర్షం కారణంగా నిలిచిన క్రికెట్‌ మ్యాచ్‌

విజయవంతంగా ముగిసిన ఆల్‌ ఇండియా మహిళా క్రికెట్‌ టోర్నీ

సాక్షి, ఖమ్మం: నగరంలోని సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో జరిగిన ఆల్‌ ఇండియా మహిళా క్రికెట్‌ టోర్నీ శుక్రవారం ముగిసింది. వర్షం కారణంగా నేపాల్‌–బంగ్లాదేశ్‌ జట్ల మధ్య జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌కు అంతరాయం కలగడంతో నిర్వాహకులు సంయుక్త విజేతలుగా ప్రకటించారు. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న నేపాల్‌ జట్టు పరిమిత ఓవర్లలో 105 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది. రుబీనాఛత్రి 48 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 52 రన్స్‌ చేయగా, శోవాఅలా 21 రన్స్‌ చేశారు. మిగతా బ్యాట్స్‌ఉమెన్లు ఆశించిన స్థాయిలో రాణించలేదు. బ్యాటింగ్‌ ఆరంభించిన బంగ్లాదేశ్‌ ఒక్క ఓవర్‌కు 4 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను నిర్వాహకులు నిలిపివేశారు.

నేపాల్‌–బంగ్లాదేశ్‌ జట్ల మధ్య మ్యాచ్‌ దృశ్యం
ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా రుబీనా (నేపాల్‌), బౌలర్‌గా ఫరుడ్రూసీ (బంగ్లాదేశ్‌), బ్యాట్స్‌ ఉమెన్‌గా ఫాతిమా (బంగ్లాదేశ్‌)కు ప్రత్యేక బహుమతులు అందజేశారు. సంయుక్త విజేతలకు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ట్రోపీ అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర మహిళా క్రికెట్‌కు ఆదరణ తీసుకొస్తామని, మహిళా క్రికెటర్ల సంఖ్య కూడా పెరిగిందని, వారికి శిక్షణ ఇచ్చేందుకు సాయం చేస్తామని చెప్పారు. అనంతరం జిల్లా జడ్జి లక్ష్మణ్, టోర్నీ కన్వీనర్‌ బిచ్చాల శ్రీనివాసరావు మాట్లాడారు. కార్యక్రమంలో మేయర్‌ పాపాలాల్, రాజుసింగ్‌ చంద్రవంశీ, డాక్టర్‌ రాజీవ్‌కుమార్‌ శ్రీవాత్సవ్, ఎ.కృష్ణకిశోర్, వినోద్‌ సింగ్‌జీ, వైవీ రెడ్డి, కల్యాణస్వామి, సందీప్‌ ఆర్య, కూరపాటి ప్రదీప్‌కుమార్, ఎండీ మతిన్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు