బ్యాంకులో చోరీకి విఫలయత్నం

9 Dec, 2014 02:42 IST|Sakshi

బ్యాంకు లాకర్ గదికి కన్నం
స్థానికుల అప్రమత్తతో దుండగుల పరారీ


మంచిర్యాల టౌన్ : మంచిర్యాల పట్టణంలోని ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ)లో ఆదివారం రాత్రి దొంగలు చోరీకి యత్నించారు. స్థానికులు అప్రమత్తం కావడంతో అక్కడి నుంచి పారిపోయారు. ఈ సంఘటన పట్టణంలో సంచలనం సృష్టించింది. ఇద్దరు దుండగులు గేట్ ద్వారా లోనికి ప్రవేశించి లాకర్ ఉన్న ప్రాంతానికి వెళ్లారు. గొడ్డలి, స్క్రూడ్రైవర్, బ్లేడ్, గునపం, పోకర్‌తో లాకర్ గదికి రంధ్రం చేశారు. మధ్యలో లాకర్ గదికి ఉన్న ఆర్‌సీసీ(సిమెంటు కాంక్రిట్ లేయర్) అడ్డు తగిలింది. దానిని పగులగొట్టే క్రమంలో శబ్ధం రావడంతో చుట్టుపక్కల వారు మేల్కోని పోలీసులకు సమాచారం అందించారు.

స్థానికులు లైట్లు వేయడంతో దుండగులు పారిపోయారు. సంఘటన స్థలాన్ని సీఐ వి.సురేశ్, ఎస్సైలు ఎస్‌కే.లతీఫ్, ఎం.వెంకటేశ్వర్లు పరిశీలించారు. దుండగులు సంఘటన స్థలంలో సారా తాగినట్లు అక్కడి ఆధారాలను బట్టి తెలుస్తోంది. బ్యాంకు సీసీ కెమెరాల్లో నిందితుల కదలికలు రికార్డయ్యాయి. పోలీసు, డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీం సంఘటన స్థలంలో ఆధారాలు సేకరించాయి. బ్యాంకుకు సంబంధించి ఎలాంటి నష్టం జరగలేదని మేనేజర్ శర్మ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ వివరించారు.

మరిన్ని వార్తలు