నిజామాబాద్‌, బాన్సువాడ హాట్‌స్పాట్‌ దిశగా!?

5 Apr, 2020 12:57 IST|Sakshi
బాన్సువాడలో కరోనా బాధితుల ఇళ్ల వైపు వెళ్లకుండా రోడ్డును మూసివేసిన దృశ్యం

సాక్షి, నిజామాబాద్‌: ఉమ్మడి జిల్లాలో కరోనా వైరస్‌ కలకలం రేపుతోంది.. ప్రధానంగా నిజామాబాద్, బాన్సువాడల్లో పరిస్థితి తీవ్రంగా మారుతోంది. శనివారం నగరంలో తాజాగా మరో పాజిటివ్‌ కేసు నమోదైంది. దీంతో జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 19కి చేరింది. బాన్సువాడలో ఏడు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఎక్కువ కేసులు నమోదైన ప్రాంతాలను హాట్‌స్పాట్‌లుగా ప్రకటించే అవకాశముంది. నిజామాబాద్, బాన్సువాడల్లో ఇప్పుడు లోకల్‌ ట్రాన్స్‌మిషన్‌ కేసులు నమోదవుతున్నాయి. ఢిల్లీలోని మర్కజ్‌ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన ఖిల్లా ప్రాంతానికి చెందిన విద్యుత్‌శాఖ రిటైర్డ్‌ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయం విదితమే.

ఆయన ద్వారా ఇటీవల అతని మనువడికి కూడా సోకినట్లు నిర్ధారణ తేలింది. అలాగే ఇటీవల జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇదే ఖిల్లా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. సదరు వ్యక్తిని బాన్సువాడకు చెందిన మరో వ్యక్తి కారులో నిజామాబాద్‌కు తీసుకొచ్చారు. ఈ క్రమంలో తాజాగా అతడికి కూడా కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఇలా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి ద్వారా అత్యంత సన్నిహితంగా మెదిలిన వారికి వైరస్‌ సోకడాన్ని వైద్యాధికారులు లోకల్‌ ట్రాన్స్‌మిషన్‌ కేసుగా పరిగణిస్తారు. 

బాన్సువాడలోనూ.. 
బాన్సువాడలో ఇప్పటికే ఇద్దరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఆ ఇద్దరి ద్వారా వారి కుటుంబ సభ్యులకు కూడా వైరస్‌ వ్యాప్తించింది. ఓ వ్యక్తి ద్వారా అతని భార్యకు రాగా, మరో వ్యక్తి ద్వారా అతని కొడుకు, కూతురుకు వైరస్‌ సోకింది. ఇలా బాన్సువాడలోనూ లోకల్‌ ట్రాన్స్‌మిషన్‌ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఈ పట్టణం కూడా పరిస్థితులు హాట్‌స్పాట్‌గా ప్రకటించే వైపు దారి తీస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

హాట్‌స్పాట్‌లను గుర్తిస్తారిలా.. 
కరోనా కేసుల తీవ్రత బట్టి ప్రభుత్వం హాట్‌స్పాట్‌గా ప్రకటిస్తుంది. పాజిటివ్‌ కేసుల నమోదు, వైరస్‌ వ్యాపిస్తున్న తీరు, లోకల్‌ ట్రాన్స్‌మిషన్‌ కేసులు, కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ కేసుల నమోదు ఆధారంగా హాట్‌స్పాట్‌లుగా గుర్తిస్తారు. నిజామాబాద్, బాన్సువాడల్లో నెలకొంటున్న పరిస్థితులు అటు వైపే దారి తీస్తుండటం ఆందోళనకు గురి చేస్తోంది. ఒకవేళ హాట్‌స్పాట్‌గా ప్రకటిస్తే.. ఈ ప్రాంతాలకు నిరీ్ణత దూరం వరకు ఇతరులను ఎవ్వరినీ అనుమతించరు. ఆయా ప్రాంతాల నుంచి వైరస్‌ వ్యాప్తించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. 

కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ కేసులు నమోదైతే కష్టమే.. 
ప్రస్తుతానికి ఉమ్మడి జిల్లాలో లోకల్‌ ట్రాన్స్‌మిషన్‌ కేసులు మాత్రమే నమోదయ్యాయి. అదే కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ కేసులు నమోదైతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ అంటే కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి తిరిగిన ప్రాంతంలో వైరస్‌ వ్యాపించి అతన్ని కలిసిన వారికి, ఆయన తిరిగిన ప్రదేశాల వద్దకు వెళ్లిన వ్యక్తులకూ వ్యాపిస్తే దాన్ని కమ్యునిటీ ట్రాన్స్‌మిషన్‌ కేసులుగా పరిగణిస్తారు.

అయితే, ఇప్పటి వరకు జిల్లాలో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ కేసులు నమోదు కాలేదని, కేవలం పాజిటివ్‌ వచ్చిన వ్యక్తితో అత్యంత సన్నిహితంగా మెదిలే కుటుంబ సభ్యులకు మాత్రమే వైరస్‌ సోకిందని జిల్లా ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌రావు ‘సాక్షి’ ప్రతినిధితో పేర్కొన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు భౌతిక దూరం పాటించాలని, ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండాలని సూచించారు. ప్రజలు ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఇబ్బందులు తప్పవని హెచ్చ
రించారు.

మరిన్ని వార్తలు