చీరలే కాదు.. నగదూ ఉందేమో...!

29 Oct, 2018 12:11 IST|Sakshi
పోలీస్‌ స్టేషన్‌ ముందు, వ్యాన్‌ నుంచి లోడ్‌ దించుతున్న దృశ్యం

‘బతుకమ్మ పండగ అయిపోయిందిగా..! బతుకమ్మ చీరలు ఇప్పుడెందుకు వచ్చాయ్‌...?’ అనేదేగా మీ ప్రశ్న..!! ‘‘ఇప్పుడెందుకొచ్చాయంటే.. ఆ పండగ అయిపోయింది, ఎన్నికల పండగొచ్చింది. చీరలను బహుమతిగా ఇచ్చి, ఓట్లను దండుకునేందుకు ప్రభుత్వం పన్నాగం పన్నింది’’ అని, విపక్షాలు సమాధానమిస్తున్నాయి. మరింత వివరంగా తెలుసుకోవాలనుకుంటే.. నిన్న (ఆదివారం) ఖమ్మంలో ఏం జరిగిందో చూడాల్సిందే. 

ఖమ్మంఅర్బన్‌: వైరాకు చెందిన డీసీఎం వ్యాన్‌ (టీఎస్‌04యూబీ3487) పెద్ద లోడ్‌తో హైదరాబాద్‌ వైపు నుంచి ఖమ్మం వెళుతోంది. నల్గొండ జిల్లా చౌటుప్పల్‌ సమీపంలోగల మారుతి కాటెక్స్‌ లిమిటెడ్‌ వద్ద శనివారం రాత్రి 157 బండిల్స్‌ లోడయ్యాయి. ఒకొక్క బండిల్‌లో 160 చీరలు, 160 జాకెట్‌ ముక్కలు ఉన్నాయి. అన్ని బండిళ్లలో కలిపి మొత్తం సుమారుగా 25,120 చీరలు, జాకెట్లు ఉన్నాయి. కొత్తగూడెంలోని వ్యవసాయ మార్కెట్‌ గోదాములో అన్‌లోడ్‌ చేసేందుకు ఈ వ్యాన్‌ బయల్దేరింది. (చీరలు, జాకెట్‌ ముక్కల వివరాలన్నీ వే బిల్‌లో ఉన్నాయి). 

లిఫ్ట్‌ ప్లీజ్‌... 
ఈ వ్యాన్, కూసుమంచి సమీపంలోకి వచ్చేసరికి డీజిల్‌ అయిపోయింది. కొంచెం దగ్గరలో పెట్రోల్‌ బంక్‌ ఉంది. అక్కడ డీజిల్‌ నింపుకునేందుకని క్యాన్‌తో డ్రైవర్‌ కిందకు దిగాడు. అటుగా బైక్‌పై వెళుతున్న ఒకరిని లిఫ్ట్‌ అడిగాడు. ఆ బైక్‌పై బయల్దేరాడు. డ్రైవర్‌కు, ఆ బైక్‌వాలాకు మాటలు కలిశాయి. ‘‘వ్యాన్‌ ఎక్కడికి వెళుతోంది? ఆ లోడ్‌ ఏమిటి..?’’ అని, బైక్‌వాలా అడిగాడు. ‘‘అవి బతకుమ్మ చీరలు, జాకెట్‌ ముక్కలు. కొత్తగూడెం తీసుకెళ్తున్నా’’ అని డ్రైవర్‌ చెప్పాడు. ఆ బైక్‌వాలాకు బల్బ్‌ వెలిగింది. ఎన్నికలో ఓట్లు దండుకునేందుకే వాటిని టీఆర్‌ఎస్, ప్రభుత్వ పెద్దలు తరలిస్తున్నారేమోనని సందేహించాడు. డ్రైవర్‌కు అనుమానం రాకుండా వ్యాన్‌ నంబర్‌ తెలుసుకుని గుర్తుంచుకున్నాడు.

అడ్డుకున్నారు... 
పెట్రోల్‌ బంక్‌ వద్ద డ్రైవర్‌ను దించిన తరువాత, టీడీపీ సానుభూతిపరుడైన ఆ బైక్‌వాలా.. టీడీపీ కూసుమంచి మండల నాయకుడు కోటేశ్వరరావుకు సమాచారమిచ్చాడు. ఆయన వెంటనే ఖమ్మంలోని జిల్లా నాయకులకు వ్యాన్‌ నంబర్‌ సహా వివరాలన్నీ చేరవేశాడు. వారు వీవీపాలెం సమీపంలో కాపుగాశారు. అది రాగానే ఆపేశారు. ఆ లోడ్‌ ఏమిటని డ్రైవర్‌ను ప్రశ్నించారు. ‘‘చీరలు ఉన్నాయి. సత్తుపల్లిలోని ఒక అడ్రసులో దింపమన్నారు’’ అని చెప్పాడు. డ్రైవర్‌ వద్దనున్న వే బిల్‌ చూశారు. కొత్తగూడెం మార్కెట్‌ కమిటీ గోదాం వద్దకు వెళుతున్నట్టుగా అందులో ఉంది. దీంతో, నాయకులకు అనుమానమొచ్చింది. పోలీసులకు, ఎన్నికల స్క్వాడ్‌ అధికారులకు, ఇతర పార్టీల (సీపీఐ, కాంగ్రెస్, సీపీఎం) నాయకులకు సమచారమిచ్చారు. అందరూ వచ్చారు.

చీరలే కాదు.. నగదూ ఉందేమో...! 
‘‘ఓటర్లకు పంచేందుకే వీటిని టీఆర్‌ఎస్‌ నాయకులు తరలిస్తున్నారు. చీరల చాటున పెద్ద మొత్తంలో నగదు కూడా ఉండొచ్చు, తనిఖీ చేయాల్సిందే’’నని ఆందోళనకు దిగారు. ఎన్నికల స్క్వాడ్‌ అధికారులు, పోలీసులు వచ్చారు. ఆ వ్యాన్‌ను రఘునాథపాలెం  పోలీస్‌ స్టేషన్‌కు తరలించాలనుకున్నారు. అది దూరంగా ఉండడంతో ఖమ్మం అర్బన్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఎన్నికల ప్రత్యేక స్క్వాడ్‌ బృందం, డీఆర్‌ఓ మదన్‌గోపాల్, నగర ఏసీపీ వెంకటరావు, ఖమ్మం అర్బన్‌ సీఐ సాయిరమణ, ఖమ్మం రూరల్‌ సీఐ రమేష్, రఘునాథపాలెం ఎస్సై క్రిష్ణ, ఖమ్మం అర్బన్‌ ఎస్‌ఐ మోహన్‌రావు, రఘునాథపాలెం డిప్యూటీ తహసీల్దార్‌ సురేష్, ఆర్‌ఐ శ్రావణ్‌కుమార్, వీఆర్‌ఓ గిరి, విపక్ష నాయకుల సమక్షంలో ఆ వ్యాన్‌లోని బండిల్స్‌ను   పోలీసులు కిందకు దించారు.

చీరులే ఉన్నాయి.. నగదు లేదు.. 
అనుమానమున్న బండిల్స్‌ను తెరిచారు. అధికారులు, నాయకులు పరిశీలించారు. వాటిలో బతుకమ్మ చీరలు మాత్రమే ఉన్నాయని, నగదు లేదని నిర్థారించుకున్నారు. వాటిని మళ్లీ లోడ్‌ చేయించా రు. పంచనామా తరువాత కొత్తగూడెం పంపిం చేశారు. ఆందోళనకు దిగిన నాయకులను ఏసీపీ వెంకట్రావ్‌ ఆధ్వర్యంలో పోలీసులు అర్బన్‌ స్టేషన్‌ లోకి తీసుకెళ్లారు. వారి జాబితాను రాసుకున్నారు. 
వ్యాన్‌ను అడ్డుకున్న వారిలో టీడీపీ నాయకులు గొల్లపూడి హరిక్రిష్ణ, చిరుమావిళ్ల నాగేశ్వరరావు, తోటకూరి శివయ్య, దుద్దుకూరి సుమంత్, కోలేటి రాధాక్రిష్ణ, ఏలూరి శ్రీనివాసరావు, జట్ల శ్రీను, కేతినేని హరిక్రిష్ణ, సీపీఎం నాయకులు నున్నా నాగేశ్వరరావు, ఎర్రా శ్రీకాంత్, సీపీఐ నాయకులు భాగం హేమంతురావు, పోటు ప్రసాద్, జానీమియా, దండి సురేష్, కాంగ్రెస్‌ నాయకులు చోటేబాబు, మనోహర్, మిక్కిలినేని నరేంద్ర తదితరులు ఉన్నారు.

ఎన్నికల అధికారులు ఏమన్నారంటే... 
‘‘ఈ వ్యాన్‌లోని బతుకమ్మ చీరలను ప్రభుత్వమే అన్నిరకాల పత్రాలతో కొత్తగూడెం గోదాముకు తరలిస్తోంది’’ అని, నగర ఏసీపీ వెంకట్రావ్, డీఆర్‌ఓ మదన్‌ గోపాల్, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారి అర్జన్‌ తెలిపారు. ఖమ్మం నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి శ్రీనివాసరావు కూడా ఒక ప్రకటనలో ఇదే విషయం స్పష్టం చేశారు.

వాటి విలువ ఐదులక్షల లోపే... 
వ్యాన్‌లోని చీరల మొత్తం విలువ రూ.4.59 లక్షలుగా వేబిల్‌లో ఉంది. అన్ని రకాల పన్నులతో రూ.5.31లక్షలుగా అందులో ఉంది. ఎనిమిది గంటలపాటు హడావుడి వ్యాన్‌ను నాయకులు అడ్డుకున్నప్పటి నుంచి దానిని తిరిగి పంపించేంత వరకు దాదాపుగా ఎనిమిది గంటలపాటు హైడ్రామా నడిచింది. పరిశీలిస్తున్న నాయకులు, అధికారులు 

మరిన్ని వార్తలు