బీసీ నోట్‌బుక్‌.. బహుజనులకు దిక్సూచి

8 Jul, 2018 01:06 IST|Sakshi
బీసీ నోట్‌బుక్‌ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న మధుసూదనాచారి, స్వామిగౌడ్‌. చిత్రంలో ఈటల, జోగు రామన్న, బీఎస్‌ రాములు తదితరులు

పుస్తకావిష్కరణ సభలో స్పీకర్‌ మధుసూదనాచారి, మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: రాజ్యాంగంలోని సామాజిక న్యాయాంశాలను, వివిధ బీసీ కమిషన్ల వివరాలను విశ్లేషిస్తూ పుస్తకాన్ని ప్రచురించడంపట్ల స్పీకర్‌ మధుసూదనాచారి, మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ తెలంగాణ బీసీ కమిషన్‌ను అభినందించారు. శనివారం అసెంబ్లీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ‘బీసీ నోట్‌బుక్‌’పుస్తకాన్ని ఆవిష్కరించారు. మధుసూదనాచారి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజ్యాంగంలో కల్పించిన హక్కులు, ప్రయోజనాలపై బీసీ కమిషన్‌ చక్కని విశ్లేషణలతో తీసుకొచ్చిన ‘బీసీ నోట్‌బుక్‌’ బహుజన సామాజిక వర్గాలకు దిక్సూచిగా నిలుస్తుందన్నారు.

స్వామిగౌడ్‌ మాట్లాడుతూ రాజ్యాంగం ఆంగ్ల భాషలో ఉండటం వల్ల ఇన్నాళ్లుగా బహుజన సామాజిక వర్గాలకు అందుబాటులో లేదన్నారు. జాతీయ, రాష్ట్రాల బీసీ కమిషన్ల వివరాలు, నివేదికలను అర్థమయ్యే విధంగా ప్రచురించడం వల్ల బహుజన సామాజిక వర్గాలు చైతన్యం కావడానికి ఎంతో దోహదపడుతుందన్నారు. ఆర్థిక మంత్రి ఈటల  రాజేందర్‌ మాట్లాడుతూ బీసీ నోట్‌బుక్‌ను రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలకు, పాఠశాలలకు, సంక్షేమ హాస్టళ్లకు అందజేయాలని, అందుకు తాము సహకరిస్తామన్నారు. మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ బీసీలకు ఈ పుస్తకం ఒక కరదీపికగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో బీసీ కమిషన్‌ చైర్మన్‌ బి.ఎస్‌.రాములు, సభ్యులు వి.కృష్ణమోహన్‌రావు, ఆంజనేయగౌడ్‌  పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు