అన్నా...తస్మాత్‌ జాగ్రత్తే!

12 Nov, 2018 15:18 IST|Sakshi

ప్రతీ అభ్యర్థి ఖర్చులపై నిశిత పరిశీలన

8 రకాల బృందాలతో నియోజకవర్గాల్లో పర్యవేక్షణ   

ఖమ్మంరూరల్‌: ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు పెట్టే ఖర్చు పర్యవేక్షణకు  అన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నికల ఏర్పాట్లు అక్రమ మద్యం, డబ్బు పంపిణీ, ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం, అనుమతి లేకుండా ప్రచార కార్యక్రమాలు చేపట్టడం లాంటి వాటిని నిరోధించేందుకు ఎనిమిది రకాల బృందాలు పర్యవేక్షిస్తున్నాయి. వీరు ప్రతీ అంశాన్ని నేరుగా పరిశీలకులు, ఎన్నికల అధికారికి సమాచారమిస్తారు.  

వ్యయ పరిశీలకులు 
వ్యయపరిశీలకులుగా ఐఏఎస్, ఐఆర్‌ఎస్, సెంట్రల్‌ ఎక్సైజ్‌ అధికారులను నియమించారు. ప్రతీ జిల్లాకు నియోజకవర్గాల సంఖ్యకనుగుణంగా పరిశీలకులను నియమించారు. ఖమ్మం జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు నులుగురు వ్యయ పరిశీలకులను నియమించారు.

సహాయ వ్యయపరిశీలకులు   
పరిశీలకులకు సాయంగా ఉండేందుకు సహాయ వ్యయపరిశీలకులను నియోజకవర్గానికి ఒకరిని నియమించారు. ప్రతీ నియోజకవర్గానికి ఆదాయ పన్ను అధికారి (ఐటీఓ) హోదా లేదా ఇతర ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్న  అధికారులు ఉంటారు.  అభ్యర్థులకు సంబంధించిన అన్ని రకాల వ్యయాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. ఈ అధికారి  వద్ద ఒక్కో అభ్యర్థి పేరుతో  ఒక్కో రిజిస్టర్‌ ఏర్పాటు చేస్తారు. షాడో రిజిస్టర్‌గా పిలిచే దీనిలో అభ్యర్థికి సంబంధించిన వివిధ కమిటీలు ఇచ్చిన వివరాలు పొందుపరుస్తారు. అభ్యర్థులు చూపే ఎన్నికల ఖర్చుతో షాడో రిజిస్టర్‌ ఖర్చులు పోల్చి చూసి తేడా ఉంటే సంజాయిషీ కోరతారు. అంతిమంగా  అభ్యర్థుల ఖర్చుల్లో వీరు చెప్పిందే ఫైనల్‌గా ఉంటుంది.

ఎంసీసీ(మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌) 
 జిల్లా వ్యాప్తంగా ఐదు నియోజకవర్గాల్లో  ఈ కమిటీలో 48 మంది పనిచేస్తున్నారు. ప్రతీ నియోజకవర్గంలో కనీసం ఐదు, ఆపై సంఖ్యలో కమిటీలను నియమించారు. ఒక్కో కమిటీలో ఓ అధికారి, ఓ ఏఎస్‌ఐతోపాటు వీడియోగ్రాఫర్‌ ఉంటారు. ప్రవర్తనా నియామవళి ఉల్లంఘనపై సమాచారం ఆధారంగా వీరు రంగంలోకి దిగుతారు. అనుమతి లేని సమావేశాలు రద్దుచేయడం, వాహనాలనను అడ్డుకోవడం వంటి విధులు నిర్వర్తిస్తారు.

నిఘా బృందాలు 
ఈ బృందాలు నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద  ఉంటాయి. జిల్లాలో ఒక్కో నియోజవర్గానికి మూడు నుంచి నాలుగు చొప్పున  చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో డీటీ స్థాయి అధికారితో పాటు ముగ్గురు ,లేదా నలుగురు కానిస్టేబుళ్లు ఉంటారు.

వీడియో నిఘా బృందాలు 
వీడియో నిఘా బృందం నియోజకవర్గానికొకటి ఉంటుంది. ప్రతీ బృందలో ఒక అధికారి, ఒక వీడియోగ్రాఫర్‌ ఉంటారు. వీరు నియోజకవర్గంలోని రాజకీయ పార్టీల సభలు, సమావేశాలు ,ర్యాలీలు, ఇతర ప్రచార కార్యక్రమాలను చిత్రీకరిస్తారు. ఒకే సమయంలో ఎక్కువ కార్యక్రమాలు ఉంటే అదనపు వీడియో గ్రాఫర్‌ను నియమించుకునే అధికారం ఆ అధికారికి ఉంటుంది.

అకౌంటింగ్‌ టీం 
జిల్లాలో మొత్తం 12 బృందాలు ఉంటాయి. ఒక్కో బృందంలో ఒక అధికారి, ఒక సహాయకుడు ఉంటారు. వీరు వీడియో వ్యూయింగ్‌ బృందాలు పంపిన సామగ్రి లెక్కలు చూసి వాటికి ఎన్నికల నిబంధనల ప్రకారం ధరలు నిర్ణయిస్తారు.

వీడియో వీక్షణ బృందం 
ప్రతీ నియోజకవర్గానికి  ఓ బృందం చొప్పున కేంద్రంలో విధులు నిర్వరిస్తుంటుంది. ఈ బృందంలో ఓ అధికారి, ఇద్దరు సహాయకులు ఉంటారు. ఈ బృందం ఫ్లయింగ్‌ స్వా్కడ్, స్టాటిక్‌ సర్వోలెన్స్‌ టీం, ఎంసీఎంసీ కమిటీల నుంచి వచ్చిన నివేదికలు, వీడియోలను పరిశీలిస్తుంది. ఉదాహరణకు వీడియో బృందం ఇచ్చిన సీడీలో అభ్యర్థి, పార్టీకి సంబంధించిన టోపీలు, కండువాలు, జెండాలు, బ్యానర్లు, వాహనాలు ఎన్ని ఉన్నాయన్న వివరాలు పరిశీలించి నమోదు చేస్తారు.

ఫ్లయింగ్‌ స్క్వాడ్‌  
ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు ప్రతీ నియోజకవర్గంలో మూడు, ఆపై సంఖ్యలో ఉంటాయి. ఒక్కో బృందానికి నాయకత్వం వహించే అధికారికి మెజిస్టీరియల్‌ అధికారాలు ఉంటాయి. ఇలా జిల్లాలో మొత్తం 5 నియోజకవర్గాలకు 60మంది ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు పనిచేస్తుంటారు.  బృందంలో ఒక వాహనం, ముగ్గురు లేదా నలుగురు కానిస్టేబుళ్ళు, ఒక ఏఎస్సై, ఒక వీడియోగ్రాఫర్‌ ఉంటారు. డబ్బు, మద్యం ఇతర ప్రలోభాలపై సమాచారమొస్తే ఆకస్మిక తనిఖీలు చేసి వాటిని రికార్డు చేస్తారు.                    

మరిన్ని వార్తలు