బుస్సుమన్న బీరు

23 May, 2018 01:46 IST|Sakshi

     బాటిల్‌పై కనిష్టంగా రూ.10, గరిష్టంగా రూ.20 పెంపు 

     ప్రభుత్వ ఉత్తర్వులు జారీ 

     పాత ధరకే పాత స్టాక్‌ అమ్మాలి లేదంటే కేసులు: ఎక్సైజ్‌ శాఖ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో బీర్ల ధరలు పెరిగాయి. ప్రతి 650 ఎంఎల్‌ సీసాపై కనిష్టంగా రూ.10, గరిష్టంగా రూ.20 చొప్పున పెంచుతూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన ధరలో సింహ భాగాన్ని బ్రూవరీల యాజమాన్యాలకే ఇవ్వనున్నారు. ఈ ఉత్తర్వులు వెలువడేందుకు ముందే టీఎస్‌బీసీఏ డిపోల నుంచి స్టాక్‌ తీసుకున్న మద్యం వ్యాపారులు పాత ధరకే బీర్లు విక్రయించాలని, కొత్త ధరకు విక్రయిస్తే ఎమ్మార్పీ ఉల్లంఘన కేసులు నమోదు చేస్తామని ఎక్సైజ్‌ కమిషనర్‌ సోమేశ్‌కుమార్‌ స్పష్టం చేశారు. నాలుగేళ్లుగా బీర్ల ధరలు పెంచలేదని, బీరు ఉత్పత్తిలో ఉపయోగించే మాల్ట్, ఫ్లేవర్స్, ఇతర ముడి పదార్థాల రేట్లు భారీగా పెరిగిపోవటంతో నష్టపోతు న్నామని, కనీసం ఈసారైనా సీసా బేసిక్‌ ధరపై 20 శాతం అదనంగా పెంచాలని బ్రూవరీలు డిమాండ్‌ చేస్తున్నాయి. కంపెనీ యాజమాన్యాల డిమాండ్‌ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బీర్ల ధరలు పెంచింది.

మొత్తం 186 రకాల బ్రాండ్లు
సాధారణంగా ఏడాది కాలానికి బీర్లు సరఫరా చేసేందుకు ప్రభుత్వం కంపెనీలతో ఒప్పందం చేసుకుంటుంది. గతేడాది కుదుర్చుకున్న ఒప్పందం ఈ ఏడాది మార్చి 31తో ముగిసింది. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త పాలసీ అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో లైసెన్స్‌ పునరుద్ధరణ ప్రక్రియ కసరత్తు చేపట్టింది. టెండర్ల ఖరారుతోపాటు బీర్ల బేసిక్‌ ధర నిర్ణయించేందుకు ప్రభుత్వం రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ గోపాల్‌రెడ్డి నేతృత్వంలో కమిటీ వేసింది. జనవరి మాసంలో టెండర్లు ఆహ్వానించగా.. మొత్తం 186 రకాల బ్రాండ్లను సరఫరా చేయడానికి కంపెనీలు టెండర్లు దాఖలు చేశాయి. వీటిలో 66 బ్రాండ్లు ఇప్పటికే వినియోగంలో ఉండగా.. కొత్తగా 120 బ్రాండ్లకు టెండర్లు దాఖలయ్యాయి. కంపెనీల యాజమాన్యంతో సంప్రదింపులు జరిపిన జస్టిస్‌ గోపాల్‌రెడ్డి కమిటీ.. బేసిక్‌ ధరపై 10 శాతం అదనంగా పెంచాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలను యథాతథంగా ఆమోదిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం సంతకం చేశారు.

ఇక్కడే ఉత్పత్తి
అంతర్జాతీయ బ్రాండ్లు అంటే విదేశాల్లోనే తయారు చేసిన మద్యాన్ని ఇక్కడికి తీసుకొచ్చి విక్రయించాలన్న నిబంధన ఏమీ లేదు. ఎక్సైజ్‌ నిబంధనల ప్రకారం పేటెంట్‌ పొందిన బీరు తయారీ ఫార్ములాతో స్థానికంగా అందుబాటులో ఉన్న బ్రూవరీల్లో వారి బ్రాండ్‌ బీరును ఉత్పత్తి చేసుకోవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 6 బ్రూవరీలతో (బీర్ల తయారీ పరిశ్రమలు) పలు అంతర్జాతీయ కంపెనీలు ఒప్పందం చేసుకొని బీర్లు ఉత్పత్తి చేశాయి. ఈ సారి టెండర్లలో సోన్‌ డిస్టిలరీస్, బ్రూవరీస్‌ మధ్యప్రదేశ్, ఎస్‌ఎన్‌జే డిస్టిలరీస్‌ నెల్లూరు, ఎస్పీఆర్‌ డిస్టిలరీస్‌ మైసూర్, ప్రివిలేజ్‌ ఇండస్ట్రీస్‌ పుణే, హరియాణా బ్రూవరీస్, సోన బ్రూవరేజెస్‌ ఛత్తీస్‌గఢ్‌ ఉన్నాయి. అలాగే రాష్ట్రీయ మార్కెట్‌లో పెద్ద వాటాదారుగా ఉన్న యూబీ (యునైటెడ్‌ బ్రూవరేజెస్‌) మైసూర్, ఔరంగాబాద్, పశ్చిమ బెంగాల్‌ తదితర ప్రాంతాల నుంచి ఈసారి కొత్తగా టెండర్లు దాఖలయ్యాయి. 

మరిన్ని వార్తలు