సీజనల్‌ వ్యాధులతో జాగ్రత్త  

10 Jul, 2018 13:05 IST|Sakshi
 వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు 

ఇందూరు(నిజామాబాద్‌ అర్బన్‌) : వర్షాలు కురుస్తున్నందున వాతావరణంలో మా ర్పులతో సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, అధికారులు అప్రమత్తంగా ఉండి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రమ్మోహన్‌ రావు సూచించారు. సోమవారం కలెక్టర్‌ వీడి యో కాన్ఫరెన్స్‌లో మండలాధికారులతో మాట్లాడారు. ఎక్కడ కూడా వర్షపు నీరు నిలువకుండా చర్యలు తీసుకోవాలని, ము రుగునీరు ఇళ్ల పరిసరాల్లో రాకుండా చూ సుకోవాలని కలెక్టర్‌ పేర్కొన్నారు.

ఎప్పటికప్పుడు గ్రామాల్లో, పట్టణాల్లో మురుగు కాలువలను, వీధులను శుభ్రం చేయించడానికి పారిశుధ్య కార్యక్రమాలు పక్కాగా నిర్వహించాలన్నారు. ఈ ఏడాది 1.85 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందులో వ్యవసాయ, ఉద్యా, అబ్కారీ, నీటి పారుదల శాఖలకు ఎక్కువ లక్ష్యాలు కేటాయించినట్లు తెలిపారు. అడవుల్లో 21లక్షల పండ్ల మొక్కలను ఈ సారి నాటనున్నామని, తద్వారా కోతులు తిరిగి అడవుల్లోకి వెళ్లే అవకాశం ఉందన్నారు.

రెండు లక్షల వెదురు మొక్కలు కూడా నాటుతున్నామన్నారు. మేదరి కులవృత్తులను పోత్సహించి ఉపాధి కల్పిస్తామన్నారు. ప్రతి మండలానికి రెండేసి లక్షల టేకు మొక్కలను అందిస్తున్నామని, వీటిని రైతులకు ఇవ్వాలన్నారు. ధరణి కార్యక్రమంలో పనులు మరింత వేగవంతం చేయాలని, రోజువారీ డిజిటల్‌ సంతకాలు ఇంకా ఎక్కువ సంఖ్యలో జరగాలని కలెక్టర్‌ తహసీల్దార్‌లను ఆదేశించారు.

మొత్తం 33,763 ఆమోదానికి గాను 18,863 సంతకాలు అయ్యాయని, ఇంకా 14,906 పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. ఏర్గట్ల మండలంలో మూడు రోజలుగా సంతకాలు కాకపోవడంపై, ముప్కాల్‌ మండలంలో నాలుగు రోజులకు గాను 15 సంతకాలు కావడంపై కలెక్టర్‌ తహసీల్దార్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల దరఖాస్తులు పెండింగ్‌ లేకుండా చూడాలని, ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేల సంతకాలు పూర్తయ్యేలా చూడాలన్నారు.

కళ్యాణలక్ష్మికి ఇప్పటి వరకు 5,137 దరఖాస్తులకు గాను 4,858 దరఖాస్తులను తహశీల్దార్లు పరిశీలించారని, మరో 279 పరిశీలించాల్సి ఉందని చెప్పారు. షాదీ ముబారక్‌లో 1,978 దరఖాస్తులకు గాను 1,875 పరిశీలించగా, 103 పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు.వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ రవీం దర్‌ రెడ్డి, జడ్పీ సీఈఓ గోవింద్, డీఆర్‌డీఓ వెంకటేశ్వర్లు, డీఎఫ్‌ఓ ప్రసాద్, ఆర్‌డీఓ వినోద్‌ కుమార్, తదితరులున్నారు. 

టీఎస్‌ ఐపాస్‌పై సమీక్ష... 

టీఎస్‌ ఐపాస్‌పై కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తన చాంబర్‌లో అధికారులతో సమీక్షించారు. పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చిన వారికి నిబంధనల ప్రకారం అనుమతులు ఇవ్వాలని, దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టవద్దన్నారు.  

మరిన్ని వార్తలు