-

దొరల ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : భట్టి

12 Oct, 2018 20:15 IST|Sakshi

సాక్షి, నాగర్ కర్నూల్ : తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీని ఇక్కడి ప్రజలంతా అమ్మలా చూస్తారని.. అటువంటి నాయకురాలిని, అమ్మనా బొమ్మానా అన్న దౌర్భాగ్యులకు బుద్ధి చెప్పాలని కాంగ్రెస్‌పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క నిప్పులు చెరిగారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు బుద్ది చెప్పేందుకు ప్రజలంతా ఇక్కడకు తరలి వచ్చారని నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బహిరంగ సభలో భట్టి అన్నారు. కొల్లాపూర్ గడ్డ పోరాటాల గడ్డ.. భూమి, భుక్తి, ఆత్మ గౌరవం కోసం ఇక్కడి  ప్రజలు ఉద్యమాలు చేశారన్నారు. తనకు చిన్నతనం నుంచే ఈ ప్రాంతం బాగా తెలుసని భట్టి అన్నారు. మల్లు ఆనంతరాములు ఎంపీగా పోటీ చేస్తున్న సమయంలో ఇక్కడి గోడలపై హస్తం గుర్తును ముద్రించిన జ్ఞాపకాలు ఇంకా గుర్తున్నాయని విక్రమార్క చెప్పారు.

ఆపద్ధర్మ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీకి వెన్ను పోటు పొడిచారన్నారు. కొల్లాపూర్ ప్రజలు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం చూపించారని తెలిపారు. జూపల్లిని శాసనసభ్యుడిగా, మంత్రిగా చేసి ఒక మనిషిగా కాంగ్రెస్ పార్టీ  తీర్చిదిద్దతే.. ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచి టీఆర్ఎస్‌లో చేరారని విక్రమార్క మండిపడ్డారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిందని భట్టి విక్రమార్క చెప్పారు. అప్పట్లో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం వృధా అని చెప్పి ప్రాజెక్ట్ ను నిలిపివేసే ప్రయత్నం చేసేంది జూపల్లి కృష్ణారావేనని విక్రమార్క చెప్పారు. అభివృద్ధి విషయంలో ఆగ్రహంగా ఉన్న కొల్లాపూర్ ప్రజలు కన్నెర్ర చేస్తే.. అందరూ మాడి పోవాల్సిందేనని అన్నారు. తెలంగాణ కోసం పోరాట చేసింది.. ఉద్యమాలు చేసింది.. ఆత్మ బలిదానాలు చేసింది.. నీళ్లు, నిధులు, నియామకాలు.. సామాజిక తెలంగాణ కోసమేనని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సామాజిక తెలంగాణ ఒక్క కాంగ్రెస్ తోనే సాధ్యమని ఆయన అన్నారు. ఖమ్మంలో మద్దతు ధర అడిగితే చేతులకు బేడీలు వేసి నడి బజారులో నడిపించారని.. సిరిసిల్లలో ఇసుక మాఫియాను అడ్డుకున్న పాపానికి అత్యంత పాశవికంగా పోలీసులుకు హింసించారు అని అన్నారు.

మరిన్ని వార్తలు