‘రూ.4,500 కోట్లు  చెల్లించండి’

23 Jan, 2019 05:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో పెండింగ్‌లో ఉన్న బిల్లుల చెల్లింపులకు తక్షణ అవసరంగా కనిష్టంగా రూ.4,500 కోట్లు చెల్లించాలని సాగునీటి శాఖ ప్రభుత్వానికి సూచించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచనల మేరకు ప్రాజెక్టుల్లో ప్రాధాన్యం ఉన్న పనులకు త్వరితగతిన బిల్లులు చెల్లించేలా చర్యలు చేపట్టింది. ఒక్కో ప్రాజెక్టు నుంచి మొదటి ప్రాధాన్యతగా ఏ పనులకు బిల్లులు చెల్లించాలన్న వివరాలు సేకరిస్తోంది. సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో ప్రస్తుతం ఏకంగా రూ.10వేల కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.

కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోనే రూ.వెయ్యి కోట్లు, దేవాదులలో రూ.668 కోట్లు, కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమాలో కలిపి మరో రూ.400 కోట్లు, డిండిలో రూ.319 కోట్లు, సీతారామలో రూ.126 కోట్లు, ఎల్లంపల్లిలో రూ.321 కోట్లు, పెన్‌గంగలో రూ.84 కోట్లుండగా, అత్యధికంగా పాలమూరు–రంగారెడ్డి పరిధిలో రూ.1,620 కోట్లు, మిషన్‌ కాకతీయకు సంబంధించి రూ.880 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఇటీవల సీఎం కేసీఆర్‌ నిర్వహించిన సమీక్ష సందర్భంగా నిధుల అవసరాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా ప్రాధాన్యతా క్రమాన్ని బట్టి నిధులు విడుదల చేయాలని సూచించారు. దీంతో ఆయా ప్రాజెక్టుల ఇంజనీర్లు వివరాలు సమర్పించారు. భూసేకరణ అవసరాలకు ప్రాధాన్యం ఇస్తూ బిల్లులను చెల్లించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.  

మరిన్ని వార్తలు