కేసీఆర్‌ బేషరతుగా క్షమాపణ చెప్పాలి

31 Mar, 2019 02:03 IST|Sakshi

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ 

సారు, కారు, పదహారు కాదు.. వారిది బారు, బీరు, సర్కారు

ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లపైచర్చకు సిద్ధమా?

సాక్షి, హైదరాబాద్‌: ‘జవాన్లపై పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఉగ్రవాద శిబిరాలపై భారత్‌ సర్జికల్‌ దాడులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన సీఎం కేసీఆర్‌ దేశ ప్రజలకు, సైనికుల కుటుంబాలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. సర్జికల్‌ స్ట్రయిక్స్‌ అంటే కార్మికుల స్ట్రయిక్‌ వంటిదని అని కేసీఆర్‌ అనుకుంటున్నారేమోనని ఎద్దేవా చేశారు. శనివారం ఇక్క డ బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 150 సీట్లు కూడా రావని కేసీఆర్‌ చెబుతున్నారని, తమ పార్టీకి 300 సీట్లు వస్తే కేసీఆర్‌ రాజకీయ సన్యాసానికి సిద్ధమవుతారా.. అని సవాల్‌ విసిరారు. సారు, కారు, పదహారు అంటూ కేటీఆర్, ఇతర టీఆర్‌ఎస్‌ నాయకు లు హడావుడి చేస్తున్నారని, వాస్తవానికి రాష్ట్రంలో బారు, బీరు, సర్కార్‌ అన్నట్టుగా పరిస్థితి తయారైందని ధ్వజమెత్తారు.

మళ్లీ ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే దేశంతోపాటు, రాష్ట్రంలోనూ రాజకీయంగా పెనుమార్పులు సంభవిస్తాయన్నారు. మహబూబ్‌నగర్‌లో ప్రధాని మోదీ సభకు వచ్చిన స్పందన చూశాక కేసీఆర్‌లో వణుకు పుట్టిందన్నారు. పాలమూరు సభ నుంచే టీఆర్‌ఎస్‌ పతనం ప్రారంభమైం దని పేర్కొన్నారు. శతకోటి లింగాల్లో బోడి లింగం కేసీఆర్‌ అని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ 16 ఎంపీ స్థానాల్లో గెలిపిస్తే ఏం చేస్తారో కేసీఆర్‌ చెప్పాలన్నా రు. లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఓడిస్తేనే కేసీఆర్‌ ఫాంహౌస్‌ నుంచి సచివాలయానికి వస్తారన్నారు. ఎన్నికల తర్వాత ఎవరి దుకాణం బంద్‌ అవుతుందో చూద్దామని లక్ష్మణ్‌ సవాల్‌ చేశారు. ప్రతిపక్షంగా ఉండి ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తారనుకుంటే డబ్బు లు, పదవులకు కాంగ్రెస్‌ వారు అమ్ముడుపోతూ పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌లో విసిగి వేసారి మాజీ మంత్రి డీకే అరుణ బీజేపీలో చేరారన్నారు. ఏప్రిల్‌ 1న ఎల్‌బీ స్టేడియం లో ప్రధాని బహిరంగసభ ఉంటుందని చెప్పారు. 

టీఆర్‌ఎస్‌ బేజారు... 
అహంకారం, అధికార మదంతో విర్రవీగే వారికి ప్రజ లు ఎలా సమాధానం చెబుతారో టీఆర్‌ఎస్‌ ఎల్‌బీ స్టేడియం సభ ఒక ఉదాహరణ అని లక్ష్మణ్‌ అన్నారు. ఈ సభ అట్టర్‌ఫ్లాప్‌ కావడంతో టీఆర్‌ఎస్‌ నేతలకు ఎటూ పాలుపోవడం లేదన్నారు. టీచర్, ఉపాధ్యా య ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో కేసీఆర్‌కు భయం పట్టుకుందన్నారు. టీఆర్‌ఎస్‌ కారు పంక్చర్‌ అయిందని, ముందు కేసీఆర్‌ తన ఇల్లు చక్కదిద్దుకుంటే మంచిదని హితవు పలికారు. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ నేతల్లో అంతర్మథనం ప్రారంభమైందన్నారు.

ఈ కుటుంబపాలనల నుంచి దేశాన్ని రాష్ట్రాన్ని విముక్తుల్ని చేయాలని రాష్ట్ర ప్రజలకు చేతులు జోడించి వేడుకుంటున్నామని అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ల కల్పన, ఆయుష్మాన్‌ భారత్‌ వంటి అంశాలపై చర్చకు తాము సిద్ధమని సవాల్‌ విసిరారు. బీసీల విషయంలో బీజేపీపై అనవసర విమర్శలు చేస్తున్న కేసీఆర్, టీఆర్‌ఎస్‌ అధ్యక్ష పదవి లేదా సీఎం పదవిని బీసీలకు ఇవ్వగలరా అని ప్రశ్నిం చారు. స్థానికసంస్థల్లో బీసీల రిజర్వేషన్లను 34 శాతం 23 శాతానికి తగ్గించిన కేసీఆర్‌ సర్కార్‌కు బీసీల గురించి మాట్లాడే నైతికహక్కు లేదన్నారు.

>
మరిన్ని వార్తలు