ఇండియాకు వస్తాననుకోలేదు 

25 Jul, 2019 12:13 IST|Sakshi
సమీనాబేగంకు ఆర్థిక సాయం చేస్తున్న ప్రహ్లాద్‌రావు

మహిళలు దుబాయికి వెళ్లొద్దు  

అక్కడ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తారు  

తాను ఎదుర్కొన్న కష్టాలను వెల్లడించిన సమీనాబేగం

 బాధితురాలికి ఆర్థికసాయం చేసిన బీజేపీ నేత ప్రహ్లాద్‌రావు

కుల్కచర్ల: బీజేపీ నిరుపేదలకు ఎల్లప్పుడు అండగా ఉంటోందని, ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరిస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రహ్లాద్‌రావు తెలిపారు. కొన్నినెలల క్రితం ఉపాధి నిమ్మిత్తం దుబాయికి వెళ్లి అక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని ఇటీవల స్వగ్రామానికి చేరుకున్న కుల్కచర్ల మండల కేంద్రానికి చెందిన సమీనాబేగంను ఆయన పార్టీ కార్యాలయంలో బుధవారం పరామర్శించారు. బతుకు దెరువు కోసం విదేశానికి వెళ్లిన ఆమె అక్కడి ఇంటి యజమానులతో నరకం అనుభవించింది. సమీనాబేగంతో ముందు తామే మాట్లాడి దుబాయ్‌లో ఉంటున్న బీజేపీ లీగల్‌  సెల్‌ అడ్వయిజర్‌ శ్రీనివాస్‌రావుకు సమాచారం అందించామని చెప్పారు. ఆయన సమీనాబేగం వద్దకు చేరుకొని కేంద్ర ప్రభుత్వం సాయంంతో ఇండియాకు రప్పించినట్లు వివరించారు. అనంతరం సమీనాబేగం తాను అక్కడ ఎదుర్కొన్న ఇబ్బందులను వెల్లడించింది.

బతుకు దెరువు కోసం ఇండియా నుంచి దుబాయికి వెళ్లిన ఆడపిల్లలను అక్కడి యజమానులు తీవ్రంగా హింసిస్తారని ఆవేదన వ్యక్తం చేసింది. మహిళలు దుబాయికి వెళ్లి ఇబ్బందులకు గురికావొద్దని చెప్పింది. తాను అక్కడ నరకం అనుభవించినట్లు తెలిపింది. తిరిగి ఇండియాకు వచ్చి తన కుటుంబాన్ని కలుసుకుంటాననుకోలేదని కలలో కూడా అనుకోలేదని ఈ సందర్భంగా సమీనాబేగం కన్నీటిపర్యంతమైంది. బీజేపీ నేత ప్రహ్లాద్‌రావు చొరవతో తాను ఇక్కడికి వచ్చానని తెలిపింది. అనంతరం సమీనాబేగంకు బీజేపీ తరఫున ఆర్థిక సహాయం అందజేశారు. ఆమెను శాలువాతో సన్మానించారు. ఎల్లప్పుడు బీజేపీ అండగా ఉంటుందని, అధైర్యపడొద్దని ఈ సందర్భంగా ఆమెకు ప్రహ్లాద్‌రావు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో  కుల్కచర్ల మాజీ సర్పంచ్‌ ఎల్లప్ప, నాయకులు మహిపాల్, కాటంపల్లి అంజిలయ్య, శివరాజ్, కిష్టరెడ్డి, తదితరులు ఉన్నారు.   

మరిన్ని వార్తలు