వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తున్న బీజేపీని ఓడించాలి 

25 Mar, 2019 04:00 IST|Sakshi

సీపీఐ, సీపీఎం నేతలు చాడ, తమ్మినేని 

సాక్షి, హైదరాబాద్‌: ఐదేళ్ల పాలనలో దేశంలోని సీబీఐ, సుప్రీంకోర్టు, కాగ్, ఆర్‌బీఐ వంటి రాజ్యాంగ వ్యవస్థలను సైతం ధ్వంసం చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని లోక్‌సభ ఎన్నికల్లో ఓడించాలని సీపీఐ, సీపీఎం పిలుపునిచ్చాయి. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే ప్రధాన కర్తవ్యంగా పోటీచేస్తున్నట్టు తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఆదివారం మఖ్దూంభవన్‌లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విలేకరులతో మాట్లాడారు. భువనగిరి, మహబూబాబాద్‌ (ఎస్టీ)లలో సీపీఐ, ఖమ్మం, నల్లగొండలలో సీపీఎం అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం సహకరించుకోవాలని నిర్ణయించినట్టు చెప్పారు.

బీజేపీ ప్రభుత్వానికి అన్ని రకాలుగా మద్దతునిస్తున్న టీఆర్‌ఎస్‌ను కూడా  ఓడించాల్సిన అవసరం ఉందని చాడ వెంకటరెడ్డి అన్నారు. సీపీఐ,సీపీఎం పోటీ చేయని స్థానాల్లో టీఆర్‌ఎస్, బీజేపీలను ఓడించగలిగే బలమైన లౌకిక, ప్రజాతంత్రశక్తులను గెలిపిం చాల్సి ఉందన్నారు.  ఈ లోక్‌సభ ఎన్నికలు సాదాసీదావి కావని తమ్మినేని వీరభద్రం వ్యా ఖ్యానించారు. దేశ ఐక్యతకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న బీజేపీని ఒక్కక్షణం కూడా అధికారంలో కొనసాగించకూడదన్నారు.  సమావే శంలో పల్లా వెంకటరెడ్డి, టి.శ్రీనివాసరావు, బాల మల్లేశ్‌ (సీపీఐ), చెరుపల్లి సీతారాములు, డీజీ నరసింహారావు(సీపీఎం)పాల్గొన్నారు.  

>
మరిన్ని వార్తలు