కేసీఆర్ ముందు మీ పప్పులు ఉడకవు!

5 Sep, 2019 13:11 IST|Sakshi

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కల్లు తాగిన కోతి

గుత్తా సుఖేందర్‌రెడ్డి మండిపాటు

సాక్షి, నల్గొండ: రాష్ట్రంలో యూరియా కొరతకు కారణం కేంద్ర ప్రభుత్వమేనని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. పది రోజుల్లో యూరియా కొరత లేకుండా చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన యూరియాను తెప్పించాల్సిన కనీస బాధ్యత బీజేపీ నాయకులకు లేదా? అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు ఢిల్లీలో కూర్చొని రాజకీయాలు చేస్తూ తెలంగాణలో అభివృద్ధిని అడ్డుకుంటున్నారని గుత్తా మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఖతం అవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని, సీఎం కేసీఆర్ ముందు బీజేపీ పప్పులు ఉడకవన్నారు. 

బ్రాహ్మణ వెళ్ళెంల ప్రాజెక్టు పూర్తికి సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం యుద్ధ ప్రాతిప్రాదికన ముందుకుపోతోందని ఈ సందర్భంగా తెలిపారు. బ్రాహ్మణ వెళ్ళెంల ప్రాజెక్టులో కమీషన్లు పొందిన నీచ చరిత్ర కోమటిరెడ్డిది అని విమర్శించారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కల్లు తాగిన కోతి అని, తప్పతాగి పూటకో మాట మాట్లాడే కోమటిరెడ్డి వ్యాఖ్యాలపై స్పందించాలంటేనే అసహ్యంగా ఉందని విమర్శించారు. రాజకీయాల్లో హుందాతనం, విజ్ఞత అవసరమని, అయితే అవి రెండూ కోమటిరెడ్డికి తెలియదని గుత్తా సుఖేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు