కేసీఆర్ కుటుంబం అబద్ధాలకు మారుపేరు

9 Sep, 2016 04:17 IST|Sakshi
కేసీఆర్ కుటుంబం అబద్ధాలకు మారుపేరు

బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి
సాక్షి, హైదరాబాద్: అబద్ధాలకు మారుపేరుగా కేసీఆర్ కుటుంబం మారిందని బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి ధ్వజమెత్తారు. అబద్ధాలను ప్రచారం చేసుకోవడమే జన్మహక్కుగా ఆ కుటుంబం వ్యవహరిస్తోందన్నారు. బీజేపీపై ఎంపీ కవిత విమర్శల నేపథ్యంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. సెప్టెంబర్ 17ను విమోచన దినంగా రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాలని తమ పార్టీ 1998 నుంచే డిమాండ్ చేస్తోందని చెప్పారు. అప్పుడు సమైక్య పాలనలో కేసీఆర్ మంత్రిగా ఉన్నా కనీసం స్పందించలేదన్నారు.

విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే నిర్వహించాలని రోశయ్య సీఎంగా ఉన్న సమయంలో  కేసీఆర్ డిమాండ్ చేశారని... కావాలంటే ఆ ఆడియో, వీడియోను పంపిస్తామన్నారు. ప్రస్తుతం ఎంఐఎంకు తొత్తుగా మారి ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రభుత్వం నిరాకరిస్తోందన్నారు. అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఉద్యమంలో 1,200 మంది ఆత్మహత్య చేసుకున్నారని చెప్పిన కేసీఆర్, ఎంత మందికి పరిహారాన్ని ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు