ప్రేమ్‌ కుమార్‌ హత్యపై స్పందించిన లక్ష్మణ్‌

6 Jun, 2019 14:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదల చూసి ఓర్వలేకనే టీఆర్‌ఎస్‌ దాడులకు పాల్పడుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్‌ ఆరోపించారు. గురువారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ తాటాకు చప్పుల్లకు బీజేపీ బెదరదని స్పష్టం చేశారు. కేసీఆర్‌ తెలంగాణను పశ్చిమ బెంగాల్‌లా మారుస్తామంటే సహించమన్నారు. రెండు రోజుల క్రితం మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకుర్ గ్రామంలో టీఆర్ఎస్ కార్యకర్తలు చేసిన దాడిలో బీజేపీ కార్యకర్త ప్రేమ్ కుమార్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మృతి చెందిన ప్రేమ్‌ కుమార్‌ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని లక్ష్మణ్‌ హామీ ఇచ్చారు. టీఆర్‌ఎస్‌ వైఖరి మార్చుకోకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

ఎంపీ ఫలితాల తర్వాత ప్రాదేశిక ఎన్నికలు నిర్వహించి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవన్నారు లక్ష్మణ్‌. బీజేపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. లేదంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు.

>
మరిన్ని వార్తలు