సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ అహంకారంతో, అవివేకంగా మాట్లాడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మండిపడ్డారు. శనివారం ప్రధాని నరేంద్ర మోదీపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లకు కేసీఆర్ గండికొట్టారని, బీసీ ప్రధానిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదన్నారు. ప్రజాసమస్యలను పక్కనపెట్టి ఫెడరల్ ఫ్రెంట్ పేరుతో కుటుంబ ప్రయోజనాల కోసమే కేసీఆర్ పర్యటనలు చేస్తున్నారని ఆరోపించారు.
మాటల గారడితో కాలం వెళ్లదీసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, గెలుపు అహంకారంతో ఇలా ఇతరులపై అసభ్యపదజాలంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తొలిసారి కేసీఆర్ సీఎం అయ్యాక దళితులను మోసం చేస్తే.. రెండోసారి బీసీలను మోసం చేశారని విమర్శించారు. 2013, 2016 ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసి ఇప్పుడు తగ్గించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం రివ్వూ పిటిషన్ ఎందుకువెయ్యలేదన్నారు. ఢిల్లీలో ప్రధానికి వంగి వంగి దండాలు పెట్టి ఇక్కడికి వచ్చి విమర్శలు చేస్తున్నారని లక్ష్మణ్ పేర్కొన్నారు.