సాక్షి, వరంగల్ : హన్మకొండలో దిష్టిబొమ్మ దగ్ధం చేస్తుండగా అపశ్రుతి చోటుచేసుకుంది. అకస్మాత్తుగా మంటలు ఎగసిపడటంతో బీజేపీ నాయకురాలి చేతులు అంటుకున్నాయి. వివరాల్లోకి వెళితే.. తొమ్మిది నెలల పసిపాపపై అత్యాచారం.. ఆపై హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ హన్మకొండ అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మా ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు దిష్టిబొమ్మను దగ్ధం చేయటానికి ఏర్పాట్లు చేశారు. దిష్టిబొమ్మలో గడ్డి కుక్కి నిప్పంటించారు. అనంతరం పెట్రోల్ బాటిల్తో అక్కడికి చేరుకున్న ఓ బీజేపీ నాయకుడు పెట్రోల్ని మండుతున్న దిష్టిబొమ్మపై అమాంతం పోశాడు.
దీంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ నేపథ్యంలో రావు పద్మా చేతులకు మంటలు అంటుకున్నాయి. అంతేకాకుండా మరో బీజేపీ నాయకుడు బింగి శ్రీనివాస్ శరీరానికి కూడా మంటలు అంటుకున్నాయి. మంటల కారణంగా గాయపడిన ఇద్దరినీ వెంటనే మాక్స్ కేర్ ఆసుపత్రికి తరలించారు.