బండారు దత్తాత్రేయ అరెస్ట్‌

30 Apr, 2019 12:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో ప్రభుత్వం, బోర్డు వైఫల్యాన్ని నిరసిస్తూ ప్రగతి భవన్‌ ముట్టడికి బీజేపీ పిలుపు నివ్వడంతో సీఎం​ నివాసం వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్, వాటర్ కేనన్స్‌తో పోలీసులు సిద్ధంగా ఉన్నారు. పలుమార్లు బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలు ప్రగతి భవన్‌వైపు దూసుకురావడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దశల వారీగా ప్రగతి భవన్ ముట్టడి వస్తున్న బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలను అదుపుచేయడం పోలీసులకు సవాల్‌గా మారింది. బీజేవైఎం హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు వినయ్ సహా 30 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. తమతో వాగ్వాదానికి దిగిన బీజేవైఎం నేత భానుప్రకాశ్‌పై పోలీసులు పిడిగుద్దులు కురిపించడంతో ఆయన ఆస్పత్రిపాలయ్యారు.

కాగా, బీజేపీ నాయకుడు జితేందర్‌రెడ్డిని గృహనిర్బంధం చేశారు. ప్రగతి భవన్‌ ముట్టడికి వస్తున్న ఎమ్మెల్సీ రామచంద్రరావును పోలీసులు అరెస్ట్‌ చేశారు. ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన చేపట్టిన కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయను పోలీసులు అదుపులోకి తీసుకుని నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె. లక్ష్మణ్‌.. నిమ్స్‌లో నిరాహారదీక్ష కొనసాగిస్తున్నారు.

మరిన్ని వార్తలు