రాజాసింగ్‌ గన్‌మెన్‌కు కరోనా పాజిటివ్‌

20 Jun, 2020 14:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను కరోనా భయం వెంటాడుతోంది. తాజాగా ఆయన గన్‌మెన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ముందుస్తు జాగ్రత్తగా రాజాసింగ్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. వాటి రిపోర్టు రావాల్సి ఉంది. దీంతో ఎమ్మెల్యేతో సమీపంగా మెలిగిన వారంతా ఆందోళన చెందుతున్నారు. కాగా తెలంగాణలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనా వైరస్‌ బారినపడిన విషయం తెలిసిందే. జనగామ శాసస సభ్యుడు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పాటు ఆయన కుటుంబ సభ్యులకు సైతం కరోనా పాజిటివ్‌గా తేలింది. మరోవైపు నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధర్‌, బీగాల గణేష్‌ గుప్తాకు సైతం వైరస్‌ సోకింది. (కరోనా వైరస్‌ బారిన మరో ఎమ్మెల్యే)

తాజాగా నిర్వహించిన పరీక్షల్లో బాజిరెడ్డి భార్యతో పాటు ఆయన డ్రైవర్‌, గన్‌మెన్‌కు కూడా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో వారితో ప్రత్యేక్షంగా కలిసి వారిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇక బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డికి సైతం కరోనా సోకిన విషయం తెలిసిందే. మరోవైపు పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు వైరస్‌ బారిన పడుతుండటంతో వారిని ప్రత్యక్షంగా కలిసి వారంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్‌ రావు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సైతం హోం క్వారెంటైన్‌లోకి వెళ్లారు. అనంతరం వీరికి నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగెటివ్‌గా తేలడంతో అధికారులంతా ఊపిరి పీల్చుకున్నారు. 

ఇక పోలీస్‌ శాఖలోనూ కరోనా తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే పలువురు పోలీస్‌ అధికారులు వైరస్‌ బారినపడగా.. తాజాగా  ముగ్గురు ఐపీఎస్‌ అధికారులకు పాజిటివ్‌గా తేలడం ఆందోళన కలిగిస్తోంది. డీజీపీ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగికి వైరస్‌ సోకడంతో.. అడిషనల్ డీజీ స్థాయి అధికారి హోం క్వారంటైన్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా జీహెచ్‌ఎంపీ పరిధిలో ఇప్పటి వరకు 180 మంది పోలీస్‌ సిబ్బంది కరోనా బారినపడ్డారు.

మరిన్ని వార్తలు