రాజాసింగ్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం

9 Apr, 2018 07:24 IST|Sakshi
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌

సాక్షి, హైదరాబాద్ : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. రాజాసింగ్‌పై ఉద్దేశపూర్వకంగా దాడికి యత్నం జరిగినట్లు బీజేపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వివరాల్లోకెళ్తే.. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆదివారం మహారాష్ట్ర ఔరంగాబాద్‌లో జరిగిన బహిరంగసభకు హాజరయ్యారు. సభ ముగిసిన అనంతరం అర్ధరాత్రి ఆయన హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. 30 కిలోమీటర్లు ప్రయాణించగానే మార్గం మధ్యలో ఆయన కారును ఓ గుర్తుతెలియని వ్యక్తి లారీతో ఢీకొట్టాలని చూశాడు. అయితే రాజాసింగ్ కారు డ్రైవర్ అప్రమత్తం కావడంతో ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు. 

అదే సమయంలో ఎమ్మెల్యే కారు వెనకాలే వస్తున్న మరో కారును ఆ లారీ ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు లారీ క్లీనర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ప్రమాదంపై ఎమ్మెల్యే రాజాసింగ్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా ఎవరైనా ఈ ప్రమాదానికి పథకం వేసి ఉండొచ్చునని ఆయన భావిస్తున్నారు. లారీతో తన కారును ఢీకొట్టాలని చూశారని ఆయన ఆరోపించారు. తన కారు డ్రైవర్ అప్రమత్తం కావడం వల్లే పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డానని రాజాసింగ్ తెలిపారు.

మరిన్ని వార్తలు