‘ఆరువందల హామీలిచ్చి అధికారంలోకి వచ్చారు’

18 Feb, 2019 14:08 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌:  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత రాజకీయ స్వలాభం కోసమే కూటమి కడుతున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. గత ఎన్నికల్లో ఆరువందల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, నాలుగున్నరేళ్లు గడిచినా వాటిని అమలుచేయలేదని ఆరోపించారు. జీవీఎల్‌ సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కల్తీ కూటమిని ప్రజలు నిర్వీర్యం చేస్తారని అన్నారు. కూటమి పేరుతో చంద్రబాబు దేశమంతా తిరుగుతూ ప్రజాధన్నాన్ని దుర్వినియోగం చేస్తూ జల్సాలు చేస్తున్నారని మండిపడ్డారు.

రాజకీయ ఎజెండా తప్ప  అభివృద్ధి, విజన్‌ లేని రాజకీయ నాయకుడు చంద్రబాబని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పథకాలను ఏపీతో పాటు తెలంగాణ కూడా నీరుగారుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలందరికీ ఆరోగ్య రక్షణ కల్పించే ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని ఆయన డిమాండ్‌​ చేశారు. ప్రత్యేక హోదా పేరుతో చంద్రబాబు దొంగ దీక్షలు, డ్రామాలు ఆడుతున్నారని జీవీఎల్‌ ఆరోపించారు.

మరిన్ని వార్తలు